అన్ని స్థానాలకు కేజ్రీవాల్ నో, మంత్రి రాఖీ కారుపై దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దేశమంతా విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తన సత్తా పరీక్షించుకునే దిశగా ఈ నెల 10 నుంచి దేశవ్యాప్త సభ్యత్వ నమోదు చేపట్టనుంది. అయితే, దేశమంతటా కాకుండా 15 నుంచి 20 రాష్ట్రాల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ జాతీయ కార్యవర్గ భేటీ ఢిల్లీలో రెండు రోజులపాటు సాగింది.
అనంతరం పార్టీ నేత యోగేంద్ర యాదవ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 నుంచి 20 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, అత్యధిక స్థానాల్లో మంచి అభ్యర్థులను పెట్టడానికి కృషి చేస్తామని తెలిపారు. కేజ్రీవాల్ నేతృత్వంలోనే లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని అయితే, కేజ్రీవాల్ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగబోరన్నారు. అలాగే ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ తొందరపాటు అవుతుందన్నారు.
కేజ్రీవాల్ సొంత రాష్ట్రం హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు, పది లోక్సభ స్థానాలు, ఢిల్లీలో ఏడు స్థానాల నుంచీ బరిలోకి దిగుతామని వివరించారు. హర్యానా ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్లో జరగాల్సి ఉంది. అయితే, వాటిని కూడా లోక్సభ ఎన్నికలతోనే నిర్వహించవచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. లోక్సభ అభ్యర్థిత్వానికి దేశంలో ఎవరైనా దరఖాస్తు చేయవచ్చునని, తొలుత రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమి టీ దాన్ని పరిశీలించి, అభిప్రాయం జోడిస్తూ దరఖాస్తును రాజకీయ సలహా సంఘానికి పంపుతుందని,అభ్యర్థిత్వంపై తుది నిర్ణయాన్ని అది తీసుకుంటుందన్నారు.
ఈ నెల 20కల్లా లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామన్నారు. అవినీతి ఆరోపణలు, నేర చరిత ఉన్నవాళ్లకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. అలాగే, ఎన్నికల వ్యూహాల రూపకల్పన, మేనిఫెస్టో, నిధులకు సంబంధించి తనతోపాటు సంజయ్ సింగ్, పంకజ్గుప్తాలతో కమిటీ ఏర్పాటైనట్లు తెలిపారు. మేనిఫెస్టోను మార్చిలో విడుదల చేస్తామని చెప్పారు. ఆప్లో చేరాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని, అందుకే 'నేను కూడా సామాన్యుడినే' పేరిట దేశవ్యాప్తంగా ఈనెల 10 నుంచి 26 వరకు సభ్యత్వ నమోదు చేపడతామని తెలిపారు. సభ్యత్వ రుసుము అనేది ఏమీ లేదన్నారు.
రాఖీబిర్లా కారుపై దుండగుల దాడి
ఎఎఫి నేత, ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రాఖీ బిర్లా కారు పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం రోహిణి ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె తన సొంత కారులో బయలుదేరారు. మంగోల్ పురిలో ఆర్ బ్లాకు వద్ద కారు ఆపి స్థానికులతో మాట్లాడుతుండగా కొందరు దుండగులు హంగామా చేశారు. అందులో ఓ వ్యక్తి పెద్ద రాయితో కారు అద్దాన్ని కొట్టాడు. దీంతో కారు అద్దం పగిలింది.
ఆ సమయంలో రాఖీ కారు ముందు సీట్లో ఉన్నారు. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. దాడి తర్వాత వారు పరారయ్యారు. రాఖీ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాను ఇలాంటి దాడులకు భయపడనని, వ్యక్తిగత భద్రత కోరబోనని ఆమె ఘటన అనంతరం అన్నారు.