కేజ్రీవాల్కు ఝలక్: బిజెపి వైపు నలుగురు ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యులు వినోద్ కుమార్ బిన్నీతో పాటు ఆ పార్టీకే చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారట. ఎఎపి, ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వైఖరితో అసంతృప్తితో ఉన్న వీరు బిజెపికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో తొందరపడకూడదని, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని బిజెపి భావిస్తోందట. ఇప్పుడు తొందరపడితే లోకసభ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని వారు భావిస్తున్నారు. మంత్రి మండలి ఏర్పాటు అవుతున్న సమయం నుంచే అసంతృప్తితో ఉన్న బిన్నీ బిజెపి నేతలకు అందుబాటులో ఉన్నారట.
బిన్నీతో పాటు పశ్చిమ ఢిల్లీ నుండి ఎన్నికైన ముగ్గురు ఎఎపి ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారట. వారు తమ ఆవేదనను బిజెపి నేతల వద్ద వ్యక్తం చేశారట కూడా. ఎఎపిలో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తిరుగుబాటు స్వరాలు త్వరలో మరిన్ని వినిపిస్తాయని అంటున్నారు. అయితే లోకసభ ఎన్నికల వరకు పార్టీలో ఉంటూనే విమర్శలు చేసే అవకాశముందంటున్నారు.
ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు నేతలు కూడా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. టీనా ఇప్పటికే సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా బిజెపి వైపు చూస్తున్నారంటున్నారు. అయితే, లోకసభ ఎన్నికల వరకు ఎలాంటి వివాదం ఉండకూడదని బిజెపి భావిస్తోంది. దీంతో లోకసభ ఎన్నికల తర్వాత లేదా ఎన్నికల సమయంలో వారు చేరే అవకాశాలు లేకలేదంటున్నారు. ఇప్పటికే బిన్నీ బిజెపి నేతలు చేసిన విమర్శలే చేశారని ఎఎపి అంటోంది.
మంత్రి ఆదేశాలు బేఖాతరు
వ్యభిచార గృహంపై దాడి జరపాలని ఢిల్లీ మంత్రి ఒకరు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదట. ఎఎపి నేత, న్యాయమంత్రి సోమనాథ్ భారతి బుధవారం అర్ధరాత్రి తన మద్దతుదారులతో కలిసి దక్షిణ ఢిల్లీలోని ఖిర్కీ అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ భవనంలో వ్యభిచారం నిర్వహించడంతో పాటు మత్తుమందును బారీ ఎత్తున విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపించడంతో భవనంలోకి వెళ్లి నిందితుల్ని అరెస్టు చేయమని పోలీసులు అధికారులను ఆదేశించారు. కానీ వారు స్పందించలేదట. అధికారులు సాకులు చెప్పారే తప్ప చర్యలు తీసుకోలేదంటున్నారు.