లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్: మోడీపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దర్యాప్తుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ వ్యవహారంలో సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడాతో సంజయ్ కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎంపీ నివాసంలో సోదాలు నిర్వహించారు.
ఆ తర్వాత సంజయ్ సింగ్ ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరెస్టైన కీలక నేతల్లో సంజయ్ సింగ్ మూడో నేత కావడం గమనార్హం.

గతంలో నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సత్యేందర్ జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడైన అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేయడంపై ఆప్ నేతలు తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా, సంజయ్ సింగ్ తండ్రి, అతని భార్, ఇతర కుటుంబసభ్యులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ప్రస్తుత ప్రధాని మోడీ అత్యంత అవినీతిపరుడని కేజ్రీవాల్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమితో మోడీ నిరాశలో ఉన్నారని అన్నారు. మోడీని వ్యతిరేకిస్తే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుపుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications