కేజ్రీవాల్కు షాక్: మోడీపై కుమార్విశ్వాస్ పొగడ్త, కానీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత కుమార్ విశ్వాస్ ఓ ప్రైవేట్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. ఏఏపీ నిర్వహణలో కీలకమైన వ్యక్తి ప్రతిపక్ష నేతను పొగడడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ ఇంటర్వ్యూలో మోడీ కశ్మీర్ పర్యటన నిర్ణయాన్ని విశ్వాస్ కొనియాడారు.
స్వతహాగా కవి అయిన విశ్వాస్ ఏఏపీలో చేరి రాజకీయ నాయకుడిగా మారారు. ఒకవేళ ఏఏపీ టిపికల్ పార్టీగా మారే రోజే గనక వస్తే రాజకీయాలకే గుడ్బై చెప్తానని ఆయన పేర్కొన్నారు. అధికారపక్షమైన బీజేపీలో చేరే అవకాశముందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటికి వచ్చేస్తానేమో కానీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు.
వ్యక్తిగతంగా తనకు నచ్చని సంఘటనల గురిచి వివరిస్తూ రాష్ట్రంలో మన నాయకుడిపై దాడి జరుగుతున్నపుడు బీజేపీ హెడ్క్వార్టర్పై రాళ్లు విసిరితే ప్రయోజనం ఏముందన్నారు. అలాగే ఢిల్లీ కుర్చీని వదిలిపెట్టాలన్న నిర్ణయాన్నీ తప్పుబట్టారు. అయితే అధికారంలో ఉండీ జన్లోక్పాల్ బిల్లును పాస్ చేయలేకపోవడం అనైతికత కిందే భావించి తప్పుకోవాలని కేజ్రీవాల్ భావించారన్నారు.
జమ్ము కాశ్మీర్ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ముందుగా హోంమంత్రి పర్యటించి వచ్చారని విశ్వాస్ చెప్పారు. ఈ పర్యటన పూర్తయిన మరుసటి రోజే మోడీ అక్కడ పర్యటించడంతో, ప్రధాని మనవాడేననే సందేశం ప్రజలకు చేరిందని కొనియాడారు. రాజకీయ వైరమంటే తనకు తెలియదన్న విశ్వాస్ ప్రధాని పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరవుతానని స్పష్టం చేశారు.
మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి.. అంటే నాకూ ప్రధానమంత్రేనని, తాను ఆయనకు ఓటేయనంత మాత్రానా తనకు ప్రధాని కాకుండా పోరాని, రాజకీయాల్లో ఆయనో వైపుంటే, తానో వైపునకు నిల్చున్నామని, మోడీ పాలన ప్రజారంజకంగా ఉంటే ఆయనను పొగడాల్సిందేనని లేకపోతే విమర్శించడం ఎలాగూ తప్పదన్నారు.