కాలుష్యం తగ్గింది: సరి-బేసి విధానంపై హైకోర్టుకు నివేదిక
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ కోసం దేశ రాజధాని ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం చేయడం వల్ల రద్దీ సమయాల్లో కాలుష్యం స్థాయి తగ్గిందని ఆప్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తన నివేదికలో వెల్లడించింది. ఈ విధానం ట్రయల్ రన్కు తమకు 15 రోజులు సరిపోదని, మరికొన్ని రోజులు పోడిగించే అవకాశం ఉందని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు తెలిపింది.
ఢిల్లీ ప్రభుత్వం తరుపున సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకు సేకరించిన కాలుష్య డేటాను చీఫ్ జస్టిస్ జీ రోహిణి, న్యాయమూర్తి జయంత్ నాథ్లతో కూడిన ధర్మాసనం ముందు ఉంచారు. ఈ విధానం వల్ల ఢిల్లీలో చాలా చోట్ల ట్రాఫిక్ తగ్గినట్లు ఆయన తన వాదనను వినిపించారు.
సరి-బేసి విధానం అమలు చేయడం వల్ల ప్రజలు రవాణా సౌకర్యాల విషయంలో ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాల కోసం త్వరలో మరిన్ని బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆప్ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.
కాగా, సరి-బేసి విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కొందరు న్యాయస్థానికి వెళ్లిన నేపథ్యంలో కాలుష్యం ఏ మేరకు తగ్గిందో 8వ తేదీ వరకు నివేదిక ఇవ్వవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు నివేదకను సమర్పించింది.
రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం సరి-బేసి వాహన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సరి-బేసి వాహన ట్రయల్ రన్ విధానం జనవరి 1 నుంచి 15తో ముగియనుంది.