లీటరు పాలు రూ. 150, కేజీ టమోటా రూ. 120
చెన్నై: చెన్నై నగరంలో వరదల కారణంగా నిత్యవసర వస్తువులు దొరకక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో జనజీవనం దుర్బరంగా తయారయ్యింది. లీటర్ పాలు రూ. 100 నుంచి రూ. 150 వరకు విక్రయిస్తున్నారు.
ఒక కేజీ టమోటాలు రూ. 120, కేజీ వంకాయలు రూ. 200కు విక్రయిస్తున్నారు. ధరలు ఎక్కువ అయినా ప్రజలు ఆకలి తట్టుకోలేక ఎగబడి కూరగాయాలు కొనుగోలు చేస్తున్నారు. అయినా అన్ని రకాల కూరగాయలకు డిమాండ్ ఎక్కువ అయ్యింది.
ఏటీఎం కేంద్రాలు ఉన్నా అవి పని చెయ్యకపోవడంతో చాల మంది డబ్బులు డ్రా చేసుకోలేక, చేతిలో చిల్లగవ్వ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పాలు, కూరగాయాలు, నిత్యవసర వస్తువులు తీసుకు వెళుతున్నారు.
గత ఆరు రోజుల నుంచి చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. వరద నీరు ఇంకా మూడు నాలుగు అడుగులు నిల్వ ఉండటంతో విద్యుత్ పునరుద్దరించడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారు.
టెలికం వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. బీఎస్ఎన్ఎల్ తో పాటు ప్రయివేటు టెలికం సంస్థల సర్వీసులు నిలిచిపోయాయి. చెన్నై నగర శివార్లలో కొన్ని ఫోన్లు మాత్రం పని చేస్తున్నాయి. రైళ్లు, బస్సు సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.