నాడు తండ్రితో నేడు కొడుకుతో: అభినందన్తో చివరి ప్రయాణంపై ఐఏఎఫ్ బాస్ దనోవా
పంజాబ్ : మరికొద్దిరోజుల్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ పదవి నుంచి పదవీవిరమణ పొందనున్న ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ దనోవా సోమవారం మిగ్ -21 యుద్ధ విమానంను నడిపిన సంగతి తెలిసిందే. అభినందన్ వర్థమాన్తో కలిసి ఆయన ఈ మిగ్-21ను పఠాన్కోట్ ఎయిర్ బేస్ నుంచి నడిపారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్దరూ యుద్ధ విమానంను నడిపారు.
మరికొద్దిరోజుల్లో రిటైర్ కానున్న ఎయిర్ చీఫ్ మార్షల్ దనోవా
మరికొద్దిరోజుల్లో తాను పదవీవిరమణ చేయబోతున్నట్లు చెప్పిన దనోవా... యుద్ధవిమానం నడపడం ఇదే చివరిది అవుతుందని చెప్పారు. అంతేకాదు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్తో కలిసి మిగ్-21లో ప్రయాణించడం తాను ఆస్వాదించినట్లు చెప్పారు. అభినందన్ వర్థమాన్ తిరిగి తన కేటగిరీని పొందడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పారు. పైలట్లు అందరూ ఎప్పుడూ దేశసేవ కోసం సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఇక 1988లో తనుకూడా ఓ సందర్భంలో ఎజెక్ట్ అయినట్లు చెప్పిన దనోవా... తిరిగి 9 నెలలకు ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే అభినందన్ మాత్రం తిరిగి 6 నెలల్లోనే ఫ్లయింగ్కు తయారయ్యారని కొనియాడారు.
నాకు అభినందన్కు మధ్య మూడు అంశాలు కామన్గా ఉన్నాయి
తనకు అభినందన్ల మధ్య మూడు అంశాలు కామన్గా ఉన్నాయని చెప్పారు. ఇద్దరం ఎయిర్క్రాఫ్ట్ నుంచి బయటకు దూకేశామని, అదికూడా ఇద్దరం ఆసమయంలో పాకిస్తాన్పై పోరాటం చేస్తున్నామని చెప్పారు. కార్గిల్లో పోరాడుతూ తనూ.. బాలాకోట్ దాడుల తర్వాత అభినందన్ ఇద్దరూ యుద్ధ విమానంలో నుంచి బయటకు దూకేసినట్లు చెప్పారు. ఇక అభినందన్ వర్థమాన్ తండ్రితో తాను యుద్ధ విమానంలో ప్రయాణించినట్లు గుర్తు చేసుకున్న ఐఏఎఫ్ బాస్... ఇప్పుడు తన కొడుకుతో యుద్ధవిమానంలో ప్రయాణించడం అది కూడా తన చివరి ప్రయాణం కావడం ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. అభినందన్ తండ్రి సింహకుట్టి వర్దమాన్ ఎయిర్ మార్షల్గా రిటైర్ అయ్యారు.
కార్గిల్ యుద్ధంలో మిగ్-21 స్క్వాడ్రన్ కమాండర్గా దనోవా
ఇదిలా ఉంటే 1999 కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో ఎయిర్ చీఫ్ మార్షల్ దనోవా మిగ్ -21కు పైలట్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఐఏఎఫ్ స్క్వాడ్రన్ కమాండర్గా వ్యవహరించారు.అభినందన్ వర్ధమాన్ కూడా బాలాకోట్ దాడుల తర్వాత పాక్ యుద్ధ విమానం ఎఫ్-16 భారత గగనతలంలోకి రావడంతో వాటిని వెంబడించుకుంటూ వెళ్లి దాన్ని కూల్చాడు.దురదృష్టవశాత్తు అభినందన్ విమానం కూడా కూలడంతో ఆయన బయటకు దూకేసి పాకిస్తాన్ భూభాగంలో పడిపోయి యుద్ధ ఖైదీగా దొరికాడు. ఈ ఘటన తర్వాత అభినందన్ ఎవరో ప్రపంచానికి తెలిసింది.