Abhinandan Varthaman కొత్త అవతారం! ఎయిర్ ఫోర్స్కు గుడ్బై
శత్రువుల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచి, పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తన పాతతరం మిగ్-21 తోనే నేలకూల్చి భారత్ కీర్తిపతాకాన్ని ఆకాశమంత ఎత్తున ఎగరేసిన ధీరుడు అభినందన్ వర్ధమాన్. భారతీయులందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ రియల్ హీరో, భారత వైమానిక దళం నుంచి ప్రీమ్యాచుర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. దాదాపు 22 ఏళ్ల పాటు దేశ రక్షణలో అసామాన్య సేవలు అందించిన ఆయన, తన జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
గ్రూప్ కెప్టెన్ హోదాలో ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన అభినందన్, ఇప్పుడు ప్రైవేట్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టారు. గోవా కేంద్రంగా సేవలందిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ 'ఫ్లై91' (FLY91) లో ఆయన కమర్షియల్ పైలట్గా చేరారు. సమాచారం ప్రకారం, ఆగస్టు నెలలోనే ఆయన ఈ ఎయిర్లైన్స్లో విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై అభినందన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రయాణీకుల సేవలందించే పౌర విమానయాన సంస్థ ఫ్లై91 ప్రతినిధులు సైతం తమ ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ గోవా, హైదరాబాద్ కేంద్రాలుగా సర్వీసులను నిర్వహిస్తోంది.

ఆ రోజేం జరిగింది?
ఫిబ్రవరి 2019లో పుల్వామా వద్ద చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీనికి ప్రతికారంగా భారత దళాలు పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి తుత్తునియలు చేశాయి. మరుసటి రోజు పాక్ వైమానిక దళం భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, వింగ్ కమాండర్ హోదాలో ఉన్న అభినందన్ వర్ధమాన్ తన మిగ్-21 బైసన్ విమానంలో దూసుకెళ్లారు. పాకిస్తాన్ వద్ద ఉన్న అత్యంత వేగవంతమైన ఎఫ్-16 విమానాన్ని ఆయన ఆకాశంలోనే ధ్వంసం చేసి రికార్డు సృష్టించారు.
పాక్ బందీగా ఉన్నా తగ్గని గుండె ధైర్యం!
ఆ పోరాటంలో అభినందన్ నడుపుతున్న మిగ్ విమానం దెబ్బతినడంతో ఆయన విమానం నుంచి పారాచ్యూట్ ద్వారా బయటకు దూకి పాక్ ఆక్రమిత భూభాగంలో పడ్డారు. మూడు రోజుల పాటు పాకిస్తాన్ సైనిక బందీగా ఉన్నప్పటికీ, ఆయన చూపిన గుండె ధైర్యం, దౌత్యపరమైన ఒత్తిడి ముందు పాక్ తలొగ్గక తప్పలేదు. మార్చి 1, 2019న ఆయనను పాక్ సురక్షితంగా భారత్కు అప్పగించింది.
యుద్ధ రంగంలో చూపిన అసామాన్యమైన ధైర్యసాహసాలకు గానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే మూడో అత్యున్నత వీరత్వ పురస్కారమైన 'వీర చక్ర' బిరుదుతో సత్కరించింది. పక్షం రోజుల పాటు రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకునేలా చేసిన ఆ చారిత్రాత్మక ఘట్టం తర్వాత, ఇప్పుడు ఆయన సాధారణ ప్రయాణికులను ఆకాశంలో సురక్షితంగా చేరవేసే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం విశేషం.














Click it and Unblock the Notifications