మోదీ కి పోటీ ఎవరు..మరోసారి అదే: వ్యూహాలు..ప్రచారమే సక్సెస్ మంత్ర: ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్..!
ప్రధాని మోదీ..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. పక్కా వ్యూహం. అమిత్ షా వ్యూహాలు రచిస్తే.. మోదీ తన మాటలనే ఓటర్లపైన మంత్రంగా ప్రయోగిస్తున్నారు. వారిద్దరి సమ్మోహన శక్తితో ఓటర్లు ఫిదా అవుతున్నారు. దీంతో..సమీప భవిష్యత్ లో ఆ ఇద్దరినీ అడ్డుకొనే వారే లేరా. వారి దూకుడుకు ఇక అడ్డు ఎక్కడ. యోధానుయోధులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరి కారణంగా బిత్తర చూపులు చూస్తోంది. సార్వత్రిక ఎన్నికలు అయినా.. ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయినా..ఆ ఇద్దరూ చాలా ముందుగానే వ్యూహ రచన చేస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర..హర్యానాలో తిరిగి పట్టు నిలబెట్టుకొనేలా ఆ ఇద్దరూ చాలా ముందుగానే వ్యూహాలు సిద్దం చేసారు. ఆర్టికల్ 370 రద్దు..అమెరికాలో మోదీ పర్యటన..ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగానికి ధీటుగా సరిహద్దుల్లో కొనసాగుతున్న భారత సైన్యం చేపడుతున్న చర్యలు మొత్తంగా ప్రధాని క్రేజ్ ను పెంచుతున్నాయి. అదే సమయంలో మోదీ ప్రచారంలో ఇవే ప్రధానాస్త్రాలుగా ప్రస్తావించారు. ఇక, ఊహించిన విధంగానే ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకు వెళ్తోంది. ఇది పూర్తిగా ఆ ఇద్దరి ఇమేజ్ ను మరింత పెంచుతోంది.
ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్..
రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ ప్రభుత్వం పక్కా వ్యూహాత్మకంగా తొలుత కాశ్మీర్ అంశం పైన ఫోకస్ చేసారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెడుతూ ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బలం కనిపించిందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రధాని మోదీ..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇదే అంశాన్ని ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ తాము తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయగలదా అని ప్రశ్నించి..కాంగ్రెస్ ను ఢిఫెన్స్ లోకి నెట్టేసారు.
మోదీని ప్రశంసలతో ముంచెత్తటం
అదే సమయంలో మోదీ అమెరికా పర్యటనలో వచ్చిన స్పందన.. అక్కడ అమెరికా అధ్యక్షుడు సైతం మోదీని ప్రశంసలతో ముంచెత్తటం..ట్రంప్ ను పాకిస్థాన్ తో చర్చల విషయంలో జోక్యం చేసుకోకుండా ఖరాకండిగా భారత విధానం మోదీ చెప్పటంలో సక్సెస్ అవ్వటం ద్వారా ప్రజల్లో మోదీ ఛరిష్మా పెరగటానికి మరింత దోహదం చేసింది. అదే విధంగా ఐక్యరాజ్యసమితిలో మోదీ ప్రసంగాలే..పాకిస్తాన్ ప్రధాని చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి మాటలతో కాకుండా.. సరిహద్దుల వద్ద చొరబాట్లను సమర్దవంతంగా నియంత్రిస్తూ చేతలతో సమాధానం ఇస్తున్నారనే భావన ఓటర్లలో వ్యక్తం అవుతోంది.
2014 ఎన్నికలతో మొదలైన పరంపర..
2012లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ఖరారు చేసింది. ఆ వెంటనే మోదీ నాడు ప్రశాంత్ కిషోర్ ను తన రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. అదే సమయంలో తన ప్రియ శిష్యుడు..నమ్మకస్తుడు అయిన అమిత్ షా ను తన టీంలోకి తెచ్చుకున్నారు. అమిత్ షా 2014లో మోదీ గెలుపు కోసం అనేక వ్యూహాలను అమలు చేసారు. ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నేతలకు వ్యూహాలు నిర్దేశించారు. ఉత్తరప్రదేశ్ లో అధిక సీట్లు గెలుచుకుంటే అధికారం ఖాయమనే విషయాన్ని నమ్మిన అమిత్ షా అక్కడ ఒంటి చేత్తో అక్కడ పార్టీకీ అధిక మొత్తంలో సీట్లు సాధించి పెట్టారు.
దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం
ఇక, 2014 లో మొదలైన ఆ ఇద్దరి జోడి విజయాల పరంపర ఇప్పటి ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం వారు పుంజుకోలేక పోతున్నారు. కానీ, ఇప్పుడు మహారాష్ట్ర ..హర్యానా ఎన్నికల్లో విజయం ద్వారా తమను సమీప భవిష్యత్ లో ఢీ కొట్టే వారు లేరనే వాదనను నిజం చేస్తున్నారు. ఇక, పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడయిన తరువాత మరోసారి బీజేపీ నేతలు మోదీ..షా ద్వయాన్ని అభినందనలతో ముంచెత్తటానికి సిద్దంగా ఉన్నారు.