ఏబీపీ-సీ ఓటర్ సర్వే: ఆ 4 రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీదే అధికారం-యూపీలో కమళ దళానికి తగ్గనున్న సీట్లు...
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ-సీ ఓటర్ సర్వే నిర్వహించింది. తాజాగా ఆ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. సర్వే ప్రకారం... ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్,మణిపూర్,గోవా రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలుపుకోనుంది. మునుపటితో పోలిస్తే యూపీలో సీట్లు తగ్గినా అధికారం మాత్రం బీజేపీదే అని వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా... ఈసారి బీజేపీ 259-267 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. సమాజ్ వాదీ పార్టీ 109 నుంచి 117 సీట్లు,బహుజన్ సమాజ్ పార్టీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 3 నుంచి 7 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. గత 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 60 సీట్ల వరకూ బీజేపీ కోల్పోనున్నట్లు అంచనా వేసింది. సర్వేలో 45 శాతం మంది ప్రజలు యోగి ఆదిత్యనాథ్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.గతంతో పోలిస్తే సమాజ్వాదీ పార్టీకి 6.6శాతం ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉండగా... బహుజన్ సమాజ్వాదీ గతంతో పోలిస్తే 6.5శాతం ఓట్లను కోల్పోనుందని సర్వే తెలిపింది. బీజేపీ ఓటు షేర్ 0.4శాతం పెరగవచ్చునని అంచనా వేసింది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ హవా ఉంటుందని సర్వే అంచనా వేసింది. ఆ పార్టీ 51-57 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 38-46 సీట్లు గెలుచుకుంటుందని... శిరోమణి అకాలీదళ్,బీజేపీలు అంతగా ప్రభావం చూపకపోవచ్చునని పేర్కొంది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సర్వే ప్రకారం ఈసారి కాంగ్రెస్ను ఆప్ వెనక్కి నెట్టనుంది.
మణిపూర్లోనూ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్ 18 నుంచి 22 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.బీజేపీకి 40.5 శాతం ఓట్లు,కాంగ్రెస్కు 34.5 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.
ఉత్తరాఖండ్లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్లో బీజేపీ 46,కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్ కొత్త సీఎం పుష్కర్ సింగ్ ధామి పట్ల 36 శాతం మంది ప్రజలు సర్వే ద్వారా సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 36శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక గోవాలోనూ బీజేపీదే అధికారమని సర్వే అంచనా వేసింది. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 4 నుంచి 8 సీట్లు,కాంగ్రెస్కు 3 నుంచి 7 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక్కడ బీజేపీకి 39.4శాతం,ఆమ్ ఆద్మీ పార్టీకి 22.2శాతం,ఇతరులకు 23శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications