కొత్త నోట్ల కోసం ఓపిక నశించి బ్యాంకు అద్దాలు పగలగొట్టారు..
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ లో.. ఓ బ్యాంకు అద్దాలను ధ్వంసం చేశారు ఖాతాదారులు. కొత్త నోట్ల కోసం గంటల తరబడి వేచియున్న ఖాతాదారులు.. సహనం నశించడంతో విధ్వంసానికి పాల్పడ్డారు. బ్యాంకు అద్దాలను పగలగొట్టిన అనంతరం బయట పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
గంటల తరబడి 'క్యూ'లో వేచియున్నా.. నోట్ల మార్పిడిలో జాప్యం జరుగుతుండడంతో.. సహనం కోల్పోయి విధ్వంసానికి పాల్పడ్డారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఖాతాదారులను శాంతింపజేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఖాతాదారులను కట్టడి చేసి.. ఆందోళనకారులను అక్కడినుంచి పంపించేశారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
కాగా, దేశవ్యాప్తంగా కొత్త నోట్ల మార్పిడి కోసం సామాన్య జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొత్త నోట్లు తీసుకున్నవారు సైతం రూ.2వేల నోటుకు చిల్లర దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఏటీఎం కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశముండడంతో.. ఈ ఇబ్బందులు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశముంది.
ప్రస్తుత ఏటీఎంలు పాత నోట్ల డిజైన్ కు తగినవిధంగా రూపొందించినవి కావడంతో.. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన నోట్ల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించుకోవాల్సి ఉంది. దీంతో సామాన్యులకు పూర్తి స్థాయి ఏటీఎం సేవలు అందుబాటులోకి రావడానికి మరో 10రోజలైనా పట్టవచ్చు.