పల్సర్ కోసం ఏటీఎంలో రూ. 50 లక్షలు లూటీ
బెంగళూరు: ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యడానికి వెళ్లిన సందర్బంలో రూ. 50 లక్షలు లూటీ చేసి పరారై జల్సాలు చేస్తున్న యువకుడిని బెంగళూరు, చిక్కబళ్లాపుర పోలీసులు అరెస్టు చేశారు. బ్రింక్స్ కంపెనీ ఉద్యోగి జగదీష్ (23) అనే యువకుడిని అరెస్టు చేశామని శుక్రవారం పోలీసులు చెప్పారు.
అక్టోబర్ 21వ తేదిన మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఎం.జీ. రోడ్డులోని ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యడానికి టాటా సుమోలో వెళ్లారు. ఆ సందర్బంలో డ్రైవర్ ప్రభు, సెక్యూరిటి గార్డు ముత్తణ్ణ, జగదీష్ ఉన్నారు.
తరువాత ప్రభు, ముత్తణ్ణలను మాయ చేసిన జగదీష్ రూ. 50 లక్షలు లూటీ చేసి అక్కడి నుంచి పరారైనాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలించారు. సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు అతని రేఖా చిత్రాలను విడుదల చేశారు.
చిక్కబళ్లాపురలో తలదాచుకున్న జగదీష్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు చిక్కబళ్లాపుర చేరుకుని అరెస్టు చేశారు. జగదీష్ రూ. 50 లక్షలు లూటీ చేసిన తరువాత చిక్కబళ్లాపుర చేరుకున్నాడు.
తరువాత పల్సర్ బైక్ కొనుగోలు చేసి నందిహిల్స్, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర చోట్ల సంచరిస్తూ జల్సాలు చేస్తున్నాడని పోలీసులు అన్నారు. నిందితుడి నుంచి రూ. 45 లక్షలు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.