ఉద్యోగం ఇస్తామంటూ మహిళపై ఐఏఎస్ అధికారి అత్యాచారం: సస్పెండ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి, అండమాన్ అండ్ నికోబార్ దీవుల మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరేన్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. తక్షణమే విధుల నుంచి తొలగిపోవాలని ఆదేశించింది. తనపై జితేంద్ర అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది.
1990 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి జితేంద్ర నరేన్పై 21 ఏళ్ల బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ ఫైనాన్సియల్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నరేన్ ఉన్నారు.
ఏప్రిల్, మే నెలల్లో నరేన్.. తనపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆగస్టు 21న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చీఫ్ సెక్రటరీ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా తీసుకోవాలని కోరింది. కార్యాలయంలోని ఉద్యోగులను కూడా గుర్తుపట్టగలనని చెప్పింది.
ఉద్యోగం కోసం వచ్చిన తనను నివాసానికి పిలిపించుకుని.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని నరేన్పై బాధితురాలు ఆరోపణలు చేసింది. ఉద్యోగం కల్పిస్తామని మద్యాన్ని బలవంతంగా తాగించి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. నరేన్ తోపాటు మరో వ్యక్తి కూడా తనపై అఘాయిత్యానికి ఒడిగట్టారని పేర్కొంది.
ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తనను బెదిరింపులకు గురిచేశారని బాధితురాలు వాపోయింది. తన వివరాలు బయటపెట్టిన ఓ జర్నలిస్టుపైనా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.