Karnataka Polls : వైసీపీ-టీడీపీ విధేయతకు పరీక్ష ? కర్నాటకలో బీజేపీ ప్రచారానికి వెళ్లేదెవరు ?
ఈసారి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విపక్ష కాంగ్రెస్ ఈ ఎన్నికల్ని ఒంటరిగానే క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వెలువడుతున్న అంచనాలు బీజేపీకి చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమ సహజమిత్రులతో పాటు తమతో పొత్తు కోరుకుంటున్న ఇతర రాష్ట్రాల్లో పార్టీలవైపు బీజేపీ చూస్తోంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి అండగా నిలిచేదెవరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో అధికార, విపక్షాలుగా ఉన్న వైసీపీ, టీడీపీలు ఈసారి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. ఎందుకంటే వీరిద్దరూ ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ జపం చేస్తున్న పార్టీలే. గత నాలుగేళ్లలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అడక్కపోయినా వీరిద్దరూ తమ ఎంపీలు, ఎమ్మల్యేలతో ఓటు వేయించారు. అలాగే పార్లమెంటులో అంతా వ్యతిరేకించిన వ్యవసాయ బిల్లులకు సైతం మద్దతుగా నిలవడమే కాకుండా ట్వీట్లు కూడా పెట్టారు. అంతే కాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మద్దతు లేకుండా గెలవలేమనే అభిప్రాయంతో ఉన్నాయి కూడా.

ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు.. బీజేపీ మీద తమ విధేయత చాటుకుంటాయా లేదా అన్న దానిపై సస్పెన్స్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల్ని బీజేపీ నేతలు సంప్రదించడం మొదలుపెట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీకి అయితే కర్నాటకలో బీజేపీకి 100 సీట్లు గెలిపించే బాధ్యత ఇచ్చారని సీపీఐ నారాయణ చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో వైఎస్ జగన్ అమిత్ షా తో భేటీ అయిన సందర్భంగా ఈ టార్గెట్ ఇచ్చారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే టీడీపీ 2018లో బీజేపీపై ఉన్న కోపంతో తమతో పాటు ఏపీ ఎన్జీవోల్ని కూడా తీసుకెళ్లి కర్నాటకలో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేయించింది. ఇప్పుడు అవే ప్రాంతాల్లో జేడీఎస్ కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేయబోతున్నారు. అలాంటి సమయంలో బీజేపీకి అనుకూలంగా టీడీపీ కానీ, వైసీపీ కానీ ఈ ప్రాంతాల్లో ప్రచారం చేస్తాయా, కేసీఆర్ వర్సెస్ జగన్ ప్లస్ చంద్రబాబు అవుతారా అన్నది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications