కావేరి చర్చ: ముగ్గులు వేసుకున్న మంత్రి, రెబల్ స్టార్ అడ్రస్ లేడు
బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో ప్రత్యేక శాసన సభ సమావేశం జరుగుతుంటే, ఓపక్క అన్నీ రాజకీయ పార్టీల నాయకులు ఈ విషయంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటే ఓ మంత్రి మాత్రం ముచ్చటగా ముగ్గులు వేసుకున్నారు.
కర్ణాటక రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి, సినీ నటి ఉమాశ్రీ శుక్రవారం జరిగిన ప్రత్యేక శాసన సభ సమావేశంలో తీరికగా పేపర్ మీద చుక్కులు పెట్టుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ లీనమైపోయి అడ్డంగా టీవీ చానళ్ల కెమెరాల కంటికి చిక్కిపోయారు.
సోషల్ మీడియాలో ఉమాశ్రీపై మండిపాటు
కర్ణాటక ప్రజలు, రైతుల గురించి పట్టించుకోకుండా ఉమాశ్రీ ముగ్గులు వేసుకున్నారని తెలుసుకున్న ప్రజలు సోషల్ మీడియాలో ఆమె తీరుపై మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ విధంగా ప్రవర్తించే మంత్రులు మనకు అవసరమా ? అని ప్రశ్నిస్తున్నారు.
వాదోపవాదాలు
బంగారప్ప సీఎంగా ఉన్న సమయంలో, హెచ్.డీ. దేవేగౌడ సీఎంగా ఉన్న సమయంలో, కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో, జగదీష్ శెట్టర్ సీఎంగా ఉన్న సమయంలో, కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సమావేశాలు పూర్తి అయ్యాయని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు ఆరవ సారి ప్రత్యేక సమావేశం జరుగుతుందని ఇప్పుడూ అలాగే ఉంటుందా అని బీజేపీ ప్రశ్నించింది.
ఎం.బి. పాటిల్ పై విరుచుకుపడిన బీజేపీ
ఈ సందర్బంలో మంత్రి ఎం.బి. పాటిల్ పై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఎం.బి. పాటిల్ సైతం బీజేపీ మీద ఎదురుదాడికి దిగారు. కావేరి గురించి చర్చించకుండా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆ సందర్బంలో తాము ఇక్కడ రాజకీయాలు చెయ్యడం రాలేదని ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ స్పష్టం చేశారు.
అడ్రస్ లేని రెబల్ స్టార్
మండ్య జిల్లాకు చెందిన రెబల్ స్టార్ అంబర్ అదే జిల్లా నుంచి శాసన సభ్యుడిగా గెలుపొంది శాసన సభలో అడుగుపెట్టి మంత్రి అయ్యారు. మంత్రి పదవి చేజారిన తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కావేరి చర్చ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి హాజరుకాకపోవడంతో మండ్య ప్రజలు మండిపడుతున్నారు. ఆయనకు చుంచశ్రీ అవార్డు ఇస్తే సహించమని హెచ్చరించారు.
మెట్టూరు డ్యాంలో 52 టీఎంసీల నీరు ఉంది. సిద్దు
తమిళనాడులోని మెట్టూరు డ్యాంలో 52 టీఎంసీల నీరు ఉందని, అక్కడి రైతులకు తమిళనాడు ప్రభుత్వం ఆ నీళ్లు వదిలిపెట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిమాండ్ చేశారు. అంతే కాని నీళ్లు లేక విలవిలలాడుతున్న మా మీద ఎందుకు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని శాసన సభలో ప్రశ్నించారు.
విధాన పరిషత్ లో ఓకే
తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యరాదని విదాన పరిషత్ లో ఎంఎల్ సీలు ముక్తకంఠంతో చెప్పారు. విదాన సభలో ఇంకా చర్చ జరుగుతుంది. ఉభయ సభలలో కావేరీ నీరు విడుదల చెయ్యరాదని తీర్మానిస్తారని ప్రజలు నమ్మకంతో ఉన్నారు.