హెల్మెట్ లేదని బైక్ ను తన్నిన సీఐ, గర్బిణి దుర్మరణం, రూ 10 లక్షలు ఇచ్చిన కమల్!
చెన్నై: హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీస్ ఇన్స్ పెక్టర్ బైక్ ను వెంబడించి బలంగా తన్నడంతో కిందపడి మరణించిన గర్బిణి కుటుంబ సభ్యులను మక్కల్ నీద మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, హీరో కమల్ హాసన్ పరామర్శించి రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.
తిరుచ్చి సీఐ
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని జాతీయ రహదారిలో బైక్ లో వెలుతున్న రాజా, ఉషా దంపతులు హెల్మెట్ పెట్టుకోలేదని వారి వాహనాన్ని వెంబడించిన ట్రాఫిక్ సీఐ కాలితో రాజా బైక్ ను బలంగా తన్నడంతో దంపతులు కిందపడిపోయారు.
గర్బిణి దుర్మరణం
శుభకార్యానికి బయలుదేరిన రాజా, ఉషా దంపతులు ట్రాఫిక్ సీఐ దెబ్బకు బైక్ మీద నుంచి కిందపడిపోయారు. సరైన సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో గర్బిణి ఉషా సంఘటనా స్థలంలోనే మరణించింది. గర్బిణి మరణానికి కారణం అయిన ట్రాఫిక్ సీఐను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
హీరో కమల్ హాసన్
బుధవారం తిరుచ్చి చేరుకున్న మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు కమల్ హాసన్ ఉషా ఇంటికి చేరుకుని ఆమె చిత్రపఠానికి నివాళులు అర్పించారు. ఉషా తల్లి లూర్ద్ మేరీ, సోదరుడు రాబర్ట్, ఉషా భర్త రాజాను కమల్ హాసన్ పరామర్శించి మీకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
రూ. 10 లక్షలు సహాయం
ఉషా తల్లి లూర్ద్ మేరీ, సోదరుడు రాబర్ట్ కు హీరో కమల్ హాసన్ రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఉషా భర్త రాజాను పరామర్శించిన కమల్ హాసన్ మరో రూ. 5 లక్షలు సహాయం చేశారు. ఉషా కుటుంబ సభ్యులకు మొత్తం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేసిన కమల్ హాసన్ ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా తనను కలవాలని వారికి సూచించారు. ఈ సందర్బంలో తిరుచ్చి జిల్లా అభిమాన సంఘాల నాయకులు కమల్ హాసన్ వెంట ఉన్నారు.