బీజేపీ ఎంపీకి నటుడు ప్రకాశ్రాజ్ లీగల్ నోటీసులు
ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు గురువారం లీగల్ నోటీసులు పంపారు. ప్రతాప్ ఇటీవల ట్విటర్ వేదికగా ప్రకాశ్రాజ్ను విమర్శించారు.
హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు గురువారం లీగల్ నోటీసులు పంపారు. ప్రతాప్ ఇటీవల ట్విటర్ వేదికగా ప్రకాశ్రాజ్ను విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు పంపినట్లు ప్రకాశ్రాజ్ తెలిపారు.
'నన్ను విమర్శించిన ప్రతాప్ సింహాకు ఓ పౌరుడిగా నోటీసులు పంపించాను. ఆయన మాటల వల్ల నా వ్యక్తిగత జీవితం డిస్ట్రబ్ అయ్యింది. దీనికి సమాధానం చెప్పమని ఆయన్ను చట్టపరంగా అడిగా.. వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా..' అని ప్రకాశ్రాజ్ చెప్పారు.
ప్రకాశ్రాజ్ ఓ మీడియా సమావేశంలో తన స్నేహితురాలు, జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సందర్భంలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కూడా ఆయన విమర్శించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా.. ప్రకాశ్రాజ్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ''ప్రకాశ్రాజ్ మీరు కుమారుడు చనిపోయిన బాధలో ఉన్నారు.. మరోవైపు భార్యను విడిచిపెట్టి.. ఓ నృత్యకారిణిని ఇష్టపడ్డారు.. అలాంటి మీకు..సీఎం యోగిని, ప్రధాని మోడీని ఏదైనా అనే హక్కు ఉందా?'' అని ప్రతాప్ తన ట్వీట్లో ప్రశ్నించారు.
ప్రకాశ్రాజ్కు సంబంధించిన ఓ కన్నడ ఆర్టికల్ను రీట్వీట్ చేస్తూ ఎంపీ ప్రతాప్ సోషల్మీడియాలో కూడా ఇలా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్రాజ్ ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. తనకు అందిన నోటీసులపై ఎంపీ ప్రతాప్ స్పందిస్తూ.. తాను కేవలం ఆ ఆర్టికల్ను రీట్వీట్ చేశానని అన్నారు.