ప్రముఖ నటుడు సెంథిల్ బీజేపీలో చేరిక: అభ్యర్థుల తరపున ప్రచారం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, ప్రముఖ సినీనటుడు సెంథిల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
పలు తమిళ చిత్రాల్లో సెంథిల్ కీలక పాత్రలు పోషించారు. అంతేగాక, హాస్యనటుడిగా కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామనాథపురంలోని ఇలంజంబోర్లో జన్మించిన సెంథిల్.. 1980లో మలయాళ చిత్రం ఇతిక్కర పక్కీలో నటుడిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి అతను ప్రధానంగా గౌండమణితో కలిసి వందలాది చిత్రాలలో నటించి సినీ అభిమానులను కడుపుబ్బా నవ్వించారు.

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సెంథిల్.. గతంలో ఏఐడీఎంకే, ఆ తర్వాత టీటీవీ దినకరన్ ఏఎంఎంకే పార్టీలోనూ పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో బీజేపీలోకి వలసలు బాగా పెరిగాయి. ప్రముఖ సినీనటులు గౌతమి, ఖుష్బూ, రాధా రవి, గంగై అమరన్, వి శేఖర్ తదితరులు బీజేపీలో ఇప్పటికే చేరిపోయారు.
తాను అన్నాడీఎంకేలో భాగస్వామిగా ఉండేందుకే తాను బీజేపీలో చేరానని, బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల్లో ప్రచారం చేస్తానని సెంథిల్ ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. కాగా, అన్నాడీఎంకే పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న బీజేపీ.. 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే, ఈ 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
కాగా, తమిళనాడు రాష్ట్రంలో ఒక దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 6న రాష్ట్ర వ్యాప్తంగా 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్నాడీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కరుణానిధి తర్వాత తన నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు డీఎంకే అధినేత స్టాలికన్ కూడా అదే స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ప్రీ పోల్ సర్వేలు స్టాలిన్ వైపే మొగ్గుచూపుతున్నా.. మే 2నే అసలైన ఫలితాలు తేలనున్నాయి.












Click it and Unblock the Notifications