నటి, రాజకీయ నేత రూపా గంగూలీపై దాడి: తృణమూల్పై ఫైర్
కోల్కతా: సినీ నటి, బిజెపి నాయకురాలు రూపా గంగూలీ కాన్వాయ్పై దాడి జరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోల్కతా నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు నగరంలోని అలిపొరే ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
తమ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు తనపై దాడి చేశారని, తన వాహనం డ్రైవర్ను కొట్టారని, కారును ధ్వంసం చేశారని రూపా గంగూలీ ఆరోపించారు.
అక్కడ ఉన్న పోలీసు అధికారులు తనను రక్షించినట్లు ఆమె తెలిపారు. తాము గెలుస్తామనే విశ్వాసంతో ఉన్నప్పుడు వారు ఈ విధమైన చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అలిపొరే ప్రాంతంలో టిఎంసి, బిజెపి కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, రూపా గంగూలీ కారులో రాగానే టిఎంసి కార్యకర్తలు ఘెరావ్ చేశారని పోలీసులు అంటున్నారు.
సంఘటనా స్థలాన్ని బిజెపి జాతీయ కార్యదర్సి సిద్ధార్త్ నాథ్ సింగ్ సందర్సించారు. తమ పార్టీకి టిఎంసి భయపడుతోందని, అందుకే దాడులకు తెగబడుతోందని ఆయన విమర్శించారు. జంగిల్ రాజ్యం నడుస్తోందని ఆన అన్నారు.