ఢిల్లీ ఆందోళనలకు మద్దతు: ప్రభుత్వ విద్యపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ!
నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలకు మద్దతుగా బాలీవుడ్ బ్యూటీ సెలీనా జైట్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విద్యార్థుల డిమాండ్లను వినాలని.. వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని సెలీనా జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కత్తి కన్నా కలమే గొప్పదని పేర్కొంటూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తన సొంత జీవిత అనుభవాలను పంచుకుంటూ ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను ఆమె ఎత్తిచూపింది. సెలీనా జైట్లీ చేసిన పోస్టును సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కూడా రీపోస్ట్ చేయడం గమనార్హం.
దేశంలోని విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు ఈ మధ్యన వచ్చినవి కావని.. ఇవి ఓ ఒక్క ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ వల్ల ఏర్పడినవి కావని సెలీనా జైట్లీ స్పష్టం చేశారు. ఇవి దశాబ్దాలుగా నడుస్తున్న సమస్యలు అని.. దేశంలోని ప్రతి బిడ్డకూ విజయం సాధించడానికి సమానమైన అవకాశాలు కల్పించేలా విద్యావ్యవస్థను పునర్మించాల్సిన సమయం ఆసన్నమైదని ఆమె స్పష్టం చేశారు. ఓ విద్యార్థికి సరైన అవకాశం లభిస్తే వారు ఏపీజే అబ్దుల్ కలాం, సుందర్ పిచాయ్ వంటి గొప్ప మేధావులుగా ఎదుగుతారని.. అయితే సరైన అవకాశాలు లేక ఎంతో మంది అసాధారణ యువ మేధావులు వెలుగులోకి రాకుండానే ఉండిపోతున్నారని సెలీనా జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలతో సెలీనా జైట్లీ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన చిన్నతనంలో ఆమె తండ్రి సైన్యంలో పనిచేసేవారని.. ఉద్యోగ రీత్యా ఉత్తరాఖండ్, కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాంలోని చిన్న చిన్న పట్టణాల్లో పెరిగానని సెలీనా జైట్లీ వెల్లడించారు. తాను దాదాపు 13 వేర్వేరు పాఠశాలలో చదివానని.. వాటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ పాఠశాలలేనని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉండేదని తెలిపారు. కొన్ని స్కూళ్లకు పైకప్పు ఉండేది కాదని.. మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే ఉండేవారు కాదని చెప్పారు. కొన్నేళ్ల పాటు కొన్ని ప్రధాన సబ్జెక్టులకు అసలు టీచర్లే లేని రోజులు కూడా తాను చూశానని సెలీనా జైట్లీ వివరించారు.
కొందరు గవర్నమెంట్ టీచర్లు స్కూల్లో పాఠాలు చెప్పకుండా విద్యార్థులను తమ ఇళ్లకు ట్యూషన్లకు రావాలని చెప్పేవారని సెలీనా జైట్లీ ఆరోపించారు. పాఠశాలలో చెప్పాల్సిన విషయాల కోసం టీచర్ల ఇళ్లకు వెళ్లి ఫీజులు చెల్లించి నేర్చుకోవాల్సి వచ్చేదని ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో తనతో పాటు చదివిన ఎంతో విద్యార్థులకు సరైన అవకాశాలు ఉంటే వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేవారని సెలీనా జైట్లీ అన్నారు.
The Pen Will Always Be Mightier Than the Sword.
— Celina Jaitly (@CelinaJaitly) July 23, 2026
The future of our nation deserves conversation, not confrontation.
The challenges facing India’s education system did not begin yesterday, nor do they belong to any one government or political party. They have existed for decades.… pic.twitter.com/AkRUQ7OTaa
ఉన్నత చదువుల కోసం వర్సిటీలు కోరే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల డొనేషన్లు కట్టే స్థోమత తన తండ్రికి లేకపోవడం వల్ల తన ప్రయాణం వేరే మార్గంలోకి సాగిందని సెలీనా జైట్లీ వెల్లడించారు. అయినప్పటికీ తాను సాధించిన స్థాయికి దేవునికి థాంక్స్ తెలుపుతూనే.. నేటి విద్యార్థులు అనుభవిస్తున్న మానసిక వేదన, నిరాశలను తాను సంపూర్ణంగా అర్థం చేసుకోగలనని చెప్పారు.
చర్చలే ఏకైక మార్గం
చివరగా ప్రభుత్వానికి, నిరసనకారులకు ఓ కీలక సూచన చేశారు సెలీనా జైట్లీ. శాంతియుత నిరసనలు చర్చలు విఫలమైనప్పుడే మొదలవుతాయని.. కానీ ఎంత పెద్ద వివాదమైనా చివరకు చర్చలు, సంప్రదింపుల ద్వారానే ముగుస్తుందని ఆమె గుర్తు చేశారు. కాబట్టి కాలయాపన చేయకుండా ఇప్పుడే ప్రభుత్వం విద్యార్థులతో చర్చలకు రావాల్సిందిగా కోరారు. ఇండియాకు అసలైన బలం ఖనిజాలు లేదా మార్కెట్లు కాదని.. ఇక్కడి పిల్లలే దేశ అతిపెద్ద సంపద అంటూ సెలీనా జైట్లీ ముగించారు.












Click it and Unblock the Notifications