బిజెపి తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటి రూపా గంగూలీ
కోల్కతా: ప్రముఖ నటి, గాయని రూపా గంగూలీ బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. హౌరాలోని శరత్ సదన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఆమెకు బీజేపీ జెండా అందించి జైట్లీ ఆహ్వానం పలికారు. టీవీ మహాభారతంలో ద్రౌపతి పాత్రతో ఆమె ప్రఖ్యాతి గాంచారు.
గౌతమ్ ఘోష్ 'పద్మ నాదిర్ మాజ్ హీ', అపర్ణా సేన్ 'యుగాంత్', రితుపర్ణ ఘోష్ 'అంతర్ మహలా' సినిమాలు ఆమె మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'అబొషెషే' బెంగాలీ సినిమాకు ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రముఖ గాయకుడు కుమార్ సాను కూడా ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. తృణమూల్ కాంగ్రెసు అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాల్ విసరడానికి అవసరమైన ఏర్పాట్లను బిజెపి చేసుకుంటోంది. బిజెపి లక్ష్యంగా ఎంచుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రూపా గంగూలీని పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది.