నా అసలు గోత్రం ఇదీ.. గతంలో అలా చెప్పాను కానీ.. నందిగ్రాం చివరి రోజు ప్రచారంలో దీదీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ,బీజేపీ అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఇప్పటికే హిందుత్వ ఎజెండాతో బీజేపీ జనంలోకి వెళ్లగా... మమతా బెనర్జీ కూడా తానూ హిందువునే అని పదేపదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం.. తాను బ్రాహ్మణ మహిళను అని... హిందుత్వ గురించి తనకు బోధించాల్సిన అవసరం లేదని మమతా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా నందిగ్రామ్లో చివరి రోజు ప్రచారంలో మమతా తన గోత్రం గురించి కూడా చెప్పుకొచ్చారు.

గతంలో అలా చెప్పాను కానీ...
మంగళవారం(మార్చి 30) నందిగ్రామ్ సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ... 'నందిగ్రామ్లో నేను రెండోసారి ప్రచారానికి వచ్చినప్పుడు స్థానిక దేవాలయానికి వెళ్లాను. అక్కడి పూజారి నా గోత్రం అడిగారు. అందుకు నేను 'తల్లి,జన్మభూమి,ప్రజలు' అని బదులిచ్చాను. అదే నా గోత్రం అని చెప్పాను. గతంలో త్రిపురలో త్రిపురేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా అక్కడి పూజారి గోత్రం అడిగితే ఇదే చెప్పాను. కానీ నా అసలు గోత్రం శాండిల్య...' అని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.

ఓటమి భయంతోనే గోత్రం కార్డు : బీజేపీ
2011 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'మా,మతి,మనుష్'(తల్లి,జన్మభూమి,ప్రజలు) నినాదంతో ప్రజల్లోకెళ్లి మమతా ఘన విజయం సాధించారు. ఇప్పుడదే నినాదాన్ని ప్రస్తావిస్తూ తన అసలు గోత్రం శాండిల్యా అని చెప్పుకొచ్చారు. మమత గోత్రం కార్డును ఉపయోగించడంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే మమత ఇలా గోత్రం కూడా చెప్పుకుంటున్నారని బీజేపీ విమర్శిస్తోంది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ... 'నాది పలానా గోత్రం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మమతా బెనర్జీ ఓటమి భయంతో గోత్రం కూడా బయటకు చెప్తున్నారు. మమతాజీ.. రోహింగ్యాలు,చొరబాటుదారులు కూడా శాండిల్య గోత్రంలోనే ఉన్నారా..? మమత ఎన్ని చెప్పినా ఆమె ఓటమి ఖాయం...' అని వ్యాఖ్యానించారు.

దీదీ గెలిస్తే మినీ పాకిస్తానే : సువెందు అధికారి
నిన్నటిదాకా టీఎంసీలో కీలక నేతగా ఉండి... ఇప్పుడు మమతతోనే తలపడుతున్న సువెందు అధికారి ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మమతా బెనర్జీకి ఈద్ ముబారక్ చెప్పడం బాగా అలవాటు. అందుకే హోలీ పండుగ రోజు కూడా హోలీ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బేగమ్కు గనుక మీరు ఓటు వేస్తే బెంగాల్ మరో మినీ పాకిస్తాన్లా తయారవుతుంది.' అని వ్యాఖ్యానించారు. కాగా,ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏప్రిల్ 1న నందిగ్రామ్ సహా 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. బెంగాల్ గడ్డపై ఈసారి విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.












Click it and Unblock the Notifications