mumbai airport: అదానీ పరం -జీవీకే గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడు, గుజరాత్ కు చెందిన గౌతమ్ అదానీ చేతికి మరో ఎయిర్ పోర్టు దక్కింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు తెలుగు వారైన జీవీ కృష్ణా రెడ్డికి చెందిన జీవీకే గ్రూపునకు దక్కగా, ఆ మధ్య మేనేజ్మెంట్ మార్పునకు సంబంధించిన ఒప్పందాలు కుదరడంతో ఇప్పుడా ఎయిర్ పోర్టు అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది.
జీవీకే గ్రూప్ నుంచి యాజమాన్య బాధ్యతలు అదానీ గ్రూప్ కు మారడంపై మంగళవారం నాడు గౌతమ్ అదానీ ప్రకటన చేశారు. ప్రపంచస్థాయి ఎయిర్ పోర్టు అదానీ గ్రూపు చేతికి రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రక్రియలో స్థానికులు వేలాది మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నామని, పోర్టును మరింతగా విస్తరించేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

మరో మూడేళ్లలో అంటే, 2024 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో సివిల్ ఏవియేషన్ మార్కెట్ గా భారత్ అవతరించబోతున్నదని, ఏవియేషన్ రంగంలో అవకాశాలను అదానీ గ్రూపు అందిపుచ్చుకుంటుందని, 2024 నాటికి నవీ ముంబై గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు.
కేవలం మెట్రో నగరాల్లోని ఎయిర్ పోర్టులపైనే కాకుండా, దేశంలోని టైర్ 2, 3 సిటీల్లోనూ ఏవియేషన్ సేవల విస్తరణకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తున్నదని, ఇప్పటికే జైపూర్, కొచ్చి, తిరువనంతపురం, గువాహటి సహా 6 ఎయిర్ పోర్టుల నిర్వహణకు ఒప్పందం చేసుకున్న విషయాన్ని అదానీ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశీయ ఎయిర్ పోర్టు రంగంలో అదానీ గ్రూప్ వాటా 25శాతానికి చేరింది. దేశంలో అతిపెద్ద ఎయిర్ పోర్టు సంస్థగా అవతరించింది. అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్.. ఇండియన్ ఎయిర్ కార్గోలో 33శాతం మార్కెట్ వాటానూ సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications