చొక్కా విప్పడం గంగూలీకే సూటౌతుంది: మమతాబెనర్జీ
కోల్కతా: చొక్కా విప్పడం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మాత్రమే చెల్లుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.
బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పాలనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం బందుకు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా బెహరాంపూర్ జిల్లా ముర్షీదాబాదులో బెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదిర్ రంజన్ చౌదరి చొక్కా విప్పి నిరసన తెలిపాడు.
పోలీసులు తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతను చొక్కా విప్పి.. దమ్ముంటే తనను కాల్చాలని సవాల్ విసిరారు.
పీసీసీ చీఫ్ చొక్కా విప్పి సవాల్ చేయడంపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. చొక్కా విప్పడం ఒక్క సౌరవ్ గంగూలీకి సూట్ అవుతుందని, ఇతరులకు కాదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో బంద్లను అనుమతించడం లేదని, కొందరు వ్యక్తులు మీడియాలో కనిపించడం కోసం చొక్కాలు విప్పుకుంటున్నారని, అయితే, వాళ్లు ఓ విషయం అర్థం చేసుకోవాలని, చొక్కా విప్పడం ఒక్క గంగూలీకే సరిపోతుందని, ఇతరులకు నప్పదన్నారు.