పెళ్ళి కాకున్నా కలిసుండొచ్చు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మేజరైన ఇద్దరు యువతీ యువకులు వివాహం కానున్నా కలిసి జీవించే హక్కుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వివాహంతో సంబంధం లేకుండానే తమకు నచ్చిన వారితో యుక్తవ వయస్సున్న యువతీ యువకులు కలిసి ఉండవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వివాహం కాకుండా యువతీ యువకులు కలిసి ఉండే సంప్రదాయం ఇండియాలో తక్కువగా ఉంది. విదేశాల్లో ఈ తరహ సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తరహ పద్దతులు ఇండియాలో కూడ ఇప్పుడిప్పుడే చోటు చేసుకొంటున్నాయి.
సహజీవనాన్ని కొన్ని చట్టసభలు గుర్తించాయి. చట్టబద్దమైన వివాహ వయస్సు వచ్చిన తర్వాత యువతీ యువకులు కలిసి ఉండొచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
నచ్చిన వారితో కలిసుండొచ్చు
యుక్త వయస్సు వచ్చిన వారికి వివాహంతో సంబంధం లేకుండానే కలిసి ఉండొచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం గృహహింస నిరోధక చట్టం 2005 కింద ‘లివ్ ఇన్ రిలేషన్షిప్స్'(సహజీవనాన్ని)ను శాసన సభ గుర్తించిందని తెలిపింది. చట్ట బద్దమైన వివాహ వయసు కంటే ముందే పెళ్లి చేసుకున్నారని కేరళకు చెందిన ఓ మేజర్ దంపతుల వివాహాన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. దాంతో తనకు న్యాయం చేయాల్సిందిగా ఆ యువకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ విన్నపం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వివాహంతో సంబంధం లేకుండా యుక్త వయసుకు వచ్చిన వారు తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది.
నందకుమార్, తుషారా కేసులో సుప్రీం కీలక తీర్పు
కేరళకు చెందిన నందకుమార్ అనే వ్యక్తి తుషారా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం నాటికి వీరిరువురు మేజర్లు అయినప్పటికి నందకుమార్కు మాత్రం 21 ఏళ్లు నిండలేదు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే వివాహానికి అర్హులు. దీనిని ఆధారంగా చేసుకుని కేరళ హైకోర్టు నందకుమార్, తుషార్ల వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. అంతేకాక తుషార్ను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నందకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు వీరి వివాహం చెల్లుబాటు అవుతోందని తీర్పును వెలువరించింది.
ఆ నిబంధన ప్రకారంగా వివాహం చెల్లుబాటు
కేరళకు చెందిన నందకుమార్, తుషారా కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఆశోక్ భూషన్ నేతృత్వంలో బెంచ్ను ఏర్పాటు చేసింది. నందకుమార్, తుషార్ ఇద్దరూ హిందూవులే అయినందున వివాహ చట్టం సెక్షన్ 12 ప్రకారంగా వీరి వివాహం చెల్లుబాటు అవుతోందని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.వీరిద్దరూ కూడ మేజర్లు అయినందున కలిసి జీవించే హక్కుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
మరో కేసును ప్రస్తావన
కేరళకు చెందిన హదియా కేసును ఈ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మేజర్లుగా ఉన్న హదియా కేసులో వివాహం చెల్లుబాటు అవుతోందని ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అయితే తుషార్, నందకుమార్ల వివాహనికి కూడ ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.నందకుమార్కు ఈ నెల 31 వ తేదికి 21 ఏళ్ళు నిండుతాయి.