30 ఏళ్ల తర్వాత తండ్రి చేపట్టిన శాఖలో..: జ్యోతిరాదిత్య సింధియా ముందు పెద్ద సవాలే
న్యూడిల్లీ/భోపాల్: కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరి.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు నరేంద్ర మోడీ కేబినెట్లో స్థానం కల్పించడంతో తగిన ప్రాధాన్యత లభించినట్లయింది. బుధవారం కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సింధియాకు పౌర విమానయాన శాఖను కేటాయించారు. ఇప్పుడిదే అంశం ఆసక్తికరంగా మారింది.
పౌర విమానయాన శాఖకు సింధియా తండ్రి మాధవరావు రాజీనామా..
ఎందుకంటే.. 1991-93 మధ్య కాలంలో పీవీ నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరావు సింధియా కూడా విమానయానం, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో పౌర విమానయాన మంత్రిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారాయన. అంతేగాక, ఓ విమానం కూలిన ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, దాదాపు 30 ఏళ్ల తర్వాత మాధవరావు కుమారుడైన జ్యోతిరాదిత్య సింధియా మళ్లీ అదే శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
జ్యోతిరాదిత్య సింధియాకు పెద్ద సవాలే..
ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియాకు పౌర విమానయాన శాఖ పెద్ద సవాలుగా మారనుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ పూర్తిస్థాయిలో విమానాలు తిరగడం లేదు. ఇలాంటి పరిస్థితిలో కీలక శాఖ బాధ్యతలు చేపట్టిన సింధియా.. ఆ శాఖను ఏమేరకు సమర్థవంతంగా నిర్వహిస్తాడనేది చర్చనీయాంశంగా మారింది.
మాధవరావు మరణాంతరం రాజకీయాల్లోకి జ్యోతిరాదిత్య సింధియా..
2001లో జరిగిన విమాన ప్రమాదంలో మాధవరావు సింధియా మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిథ్యం వహించిన గుణ లోక్సభ నియోజకవర్గం నుంచే 2002లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. జ్యోతిరాదిత్య సింధియా రాజకుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.
జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ తగిన ప్రాధాన్యత..
దాదాపు రెండు దశాబ్దాలపాటు కాంగ్రెస్లో పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాల కారణంగా గత సంవత్సరం బీజేపీలో చేరారు. అంతేగాక, 22 మంది ఎమ్మెల్యేలను తనవెంట తీసుకెళ్లి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడిన 15 నెలలకే పడగొట్టారు. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు. ఈ నేపథ్యంలోనే జ్యతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపిన బీజేపీ.. ఇప్పుడు కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించింది.