టారిఫ్ల పెంపుతో టెలికాం రంగంలో మళ్లీ పోటీ ? విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
Recommended Video
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు ఎయిర్టెల్, వొడాఫోన్లు తమ టారిఫ్ రేట్లను డిసెంబర్ నెల నుంచి పెంచుతున్నట్లు ప్రకటించగానే... జియో కూడా టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ఏజీఆర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రైవేట్ సంస్థలకు సంకటంగా మారడంతో తప్పని పరిస్థితుల్లో ఎయిర్టెల్ వొడాఫోన్ సంస్థలు తమ టారిఫ్ రేట్లను పెంచాల్సి వస్తుందని గతవారం చెప్పిన సంగతి తెలిసిందే.
వెయిట్ అండ్ వాచ్ : బీఎస్ఎన్ఎల్, జియోలు తమ టారిఫ్లను పెంచుతాయా..?
సుప్రీంకోర్టు తీర్పుతో కష్టాలు
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రెవిన్యూ మరింత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎయిర్టెల్, వొడాఫోన్లు మరిన్ని పెట్టుబడుల కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని బకాయిలను మూడునెలల సమయంలోగా చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో భారత టెలికాం శాఖకు ఎయిర్టెల్, వొడాఫోన్లు మొత్తం రూ.92వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఎంటీఎన్ఎల్లో బీఎస్ఎన్ఎల్ విలీనం
ఇక ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా డిసెంబర్ 1, 2019 నుంచి తన టారిఫ్లను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మధ్యే ఎంటీఎన్ఎల్లో బీఎస్ఎన్ఎల్ను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు 4జీ స్పెక్ట్రమ్ కూడా బీఎస్ఎన్ఎల్కు కేటాయించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఎంటీఎన్ఎల్ - బీఎస్ఎన్ఎల్లో రూ.29,937 కోట్లును పెట్టుబడులుగా పెట్టేందుకు ఓకే చెప్పింది కేంద్రం. రెండు కంపెనీలకు చెందిన ఆస్తులు రూ.38వేలు కోట్లుగా ఉంది. 2016 రేట్ల ప్రకారమే 4జీ కేటాయింపులు జరుపుతుందని సమాచారం.
పరిపాలనా కేటాయింపు ప్రాతిపదికన 4జీ స్పెక్ట్రం
ఈ మధ్యనే బీఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిపాలనా కేటాయింపు ప్రాతిపదికన ప్రభుత్వం 4 జీ స్పెక్ట్రంను అందిస్తుంది.ఇప్పటికే కేంద్రమంత్రివర్గం బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ విలీనంకు ఓకే చేసింది. అయితే ఇదంతా కార్యరూపం దాల్చేవరకు ఎంటీఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ సబ్సిడరీ కంపెనీగానే ఉంటుందని కేంద్ర టెలికాంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
జియో కూడా టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం నష్టాల్లో ఉన్న ఎయిర్టెల్ వొడాఫోన్ టెలికాం సంస్థలకు వరంగా మారిందని చెబుతున్నారు విశ్లేషకులు. జియో తన టారిఫ్ ధరలు పెంచడం వల్ల రానున్న మూడునెలల్లో ఎయిర్టెల్, వొడాఫోన్ సంస్థలు 30శాతం మేరా టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో టెలికాం రంగంలో ప్రైసింగ్ విధానమే మారిపోతుందనే ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. జియో తన టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిందంటే త్వరలోనే భారత టెలికాం కింద వచ్చే ప్రైవేట్ నెట్వర్క్లు ధరల పెంపు విషయంలో పునరాలోచనలో పడుతాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంస్థ చెబుతోంది. టారిఫ్ల పెంపుతో టెలికాం ఇండస్ట్రీలో పోటీ నెలకొంటుందని ఆ సంస్థ పేర్కొంది.