చంద్రబాబు అడుగుజాడల్లోనే: సీబీఐకి నో ఎంట్రీ చెప్పిన మమతా సర్కార్
Recommended Video

కేంద్ర విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐని ఆంధ్రప్రదేశ్లో కేసులను విచారణ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ ఏపీ సర్కార్ జీవోను విడుదల చేసినట్లు వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కేసులను విచారణ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరిన్ని రాష్ట్రాలు ఇదే స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే కొనసాగితే సీబీఐ అనే సంస్థే ప్రశ్నార్థకంగా మారే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు నిర్ణయం
సీబీఐ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈ కేంద్ర విచారణ సంస్థపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తున్నాయి. తమ రాష్ట్రంలో ఉన్న కేసుల విచారణను తామే చేసుకుంటామని... సీబీఐకి తమ రాష్ట్ర భూభాగ పరిధిలోని కేసులను విచారణ చేసేందుకు అనుమతి నిరాకరిస్తున్నాయి. ఇందులో భాగంగానే తొలుత ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తమ రాష్ట్రంలో విచారణ చేపట్టరాదని రహస్యంగా ఏపీ సర్కార్ జీవో విడుదల చేసింది. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది.
కేవలం చంద్రబాబు అతని అనుచరులపై ఉన్న అవినీతి కేసులకు భయపడే సర్కార్ ఈ తరహా ఆలోచన చేసిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. అయితే ఏపీ సర్కార్ వివరణ మాత్రం వేరుగా ఉంది. సీబీఐ వ్యవస్థలోనే అవినీతి ఆరోపణలు రావడంతో ఆ సంస్థను విశ్వసించే ప్రసక్తే లేదని చెప్పింది. అంతేకాదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కనుసన్నుల్లో సీబీఐ నడుస్తోందంటూ ఆరోపించింది. రాజకీయ అవసరతలు తీర్చుకునేందుకు సీబీఐని పావుగా వాడుకుంటున్నారని ఏపీ హోంమంత్రి చిన్నరాజప్ప చెప్పారు.

బాబు అడుగుజాడల్లోనే బెంగాల్ దీదీ మమతా
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమర్థించారు. చంద్రబాబు చేసిన పని చాలా మంచిదన్నారు మమతా. దీనిపై ప్రతి రాష్ట్రం ఆలోచించాలన్నారు. స్వతంత్ర సంస్థకు బీజేపీ కార్యాలయాన్నుంచి ఆదేశాలు వెళుతున్నాయని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. వెను వెంటనే మమత ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఏపీ ప్రభుత్వం అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించారు. వెస్ట్ బెంగాల్ భూభాగంలోకి వచ్చే కేసుల విచారణకు సీబీఐకి అనుమతి నిరాకరించాలని భావిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 1989లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సీబీఐకి సాధారణ సమ్మతి తెలుపుతూ ఆదేశాలు ఇచ్చిందని ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారి తెలిపారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేసుకోవచ్చు.

బెంగాల్లో పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేస్తున్న సీబీఐ
బెంగాల్లో సీబీఐ పలు హై ప్రొఫైల్ కేసులను విచారణ చేస్తోంది. ఇందులో శారదా స్కామ్, రోజ్ వ్యాలీ పొజీ స్కామ్, ఆనాటి తృణమూల్ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 20 మంది ముడుపులు తీసుకుంటూ వీడియో ఆడియో టేపులతో పట్టుబడిన నారద స్టింగ్ ఆపరేషన్ కేసులను సీబీఐ విచారణ చేస్తోంది. రాష్ట్ర పరిధిలోని కేసులకు మాత్రమే విచారణ చేసేందుకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు సీపీఎం నేత కోల్కతా మాజీ మేయర్ బికాష్ రంజన్ భట్టాచార్య. అయితే కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చే కేసులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని చెప్పారు.

చంద్రబాబుకు కేజ్రీవాల్ మద్దతు... సమాలోచనలు చేస్తున్న పంజాబ్ సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీబీఐ విచారణపై అనుమతి నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. చంద్రబాబుకు మద్దతు పలుకుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. చంద్రబాబు మంచి పని చేశారని కితాబిస్తూ ఆదాయపు పన్ను శాఖను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాదు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ను కూడా విచారణ చేయకుండా ఏపీలో అనుమతులు రద్దు చేయాలంటూ చంద్రబాబుకు ట్వీట్ ద్వారా సూచించారు అరవింద్ కేజ్రీవాల్. చంద్రబాబు నిర్ణయంపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications