బెంగళూరు తర్వాత ఢిల్లీ: నాగా వారిని బ్యాట్లతో కొట్టారు
న్యూఢిల్లీ: కన్నడంలో మాట్లాడలేదని బెంగళూరులో ఇద్దరు మణిపూర్ విద్యార్థులను చితకబాదిన విషయం మరవకముందే గుర్గావ్లో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అయితే, ఈసారి బాధితులు నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన వారు. గుర్గావ్లోని సికిందరపురలో ఏడుగురు స్థానికులు ఇద్దరు నాగాలాండు వ్యక్తులను బుధవారం రాత్రి పట్టుకొని చితకబాదారు.
బ్యాట్లు, వికెట్లు, హాకీ స్టిక్స్తో చితకబాదారు. 25 ఏళ్ల వయసున్న అవాంగ్, చెస్టర్లు ఢిల్లీలోని కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నారు. వారు గత రెండేళ్లుగా సికిందరపురలోనే ఉంటున్నారు. వీరు తమ గదిలో ఉన్న సమయంలో బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఏడుగురు వచ్చి, వారిని వెజిటేబుల్ మార్కెట్ వద్దకు తీసుకు వెళ్లారు.
అక్కడే వారిని చితకబాదారు. వారి జుట్టు కత్తిరించారు. అంతేకాకుండా.. ఈ ప్రాంతంలో ఉన్న మీ నార్త్ ఈస్ట్కు చెందిన స్నేహితులకు ఫోన్ చేసి, ఈ ప్రాంతం విడిచి వెళ్లాలని చెప్పాలని బెదిరించారు. మణిపూర్, నాగాలాండ్ నుండి వచ్చే యువకులు ఇక్కడకు వచ్చి ఉంటే చంపేస్తామని వారు బెదిరించారని బాధితులు చెబుతున్నారు.

బాధితులను వెంటనే స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వారికి తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు దాడి జరిగిన ప్రాంతంలో తరుచూ ఇలాంటివి జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నార్త్ ఈస్ట్కు చెందిన పలువురు మండిపడుతున్నారు.
కాగా, కన్నడ భాష మాట్లాడలేదనే కారణంతో మణిపూర్కు చెందిన విద్యార్థిపై సామూహిక దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్రేతర విద్యార్థులు ఎక్కువగా నివసించే కర్ణాటకలోని కోతనూర్లో మంగళవారం రాత్రి ఆ ఘటన చోటు చేసుకుంది.
తాజా దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపులపై గాయాలయ్యాయి. అయితే మైఖేల్ ఆరోగ్య పరిస్థితిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. ఈ ఘటనలో మైఖేల్తో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు.
కన్నడ భాషలో మాట్లాడాలని బలవంతం చేశారని, రాష్ట్రేతరులుగా కర్ణాటకలో పండించిన ఆహారాన్ని తినడం నేర్చుకున్న మీరు కన్నడ భాషలో మాట్లాడాలని, ఇది చైనా కాదని, భారతదేశం అంటూ తమపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదులో చెప్పారు. మైఖేల్ మంగళవారం రాత్రి మిత్రులతో కలిసి డిన్నర్కు రెస్టారెంట్కు వెళ్లిన సమయంలో దాడి జరిగింది.
ఆహారం కోసం ఎదురు చూస్తూ మైఖైల్ బృందం ఇంగ్లీషులో మాట్లాడుకుంటోంది. పక్క బల్లపై కూర్చున్నవారు వారి ఇంగ్లీష్ సంభాషణకు అభ్యంతరం చెప్పారు. జాతి వివక్షతోనే తమపై దాడి చేశారని మైఖేల్ అన్నాడు. స్థానిక యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) ఆలోక్ కుమార్ ఓ వార్తాసంస్థతో చెప్పారు.












Click it and Unblock the Notifications