ఇప్పుడు కొత్తగా వైట్ ఫంగస్: ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరం, వీరిలోనే ఎక్కువగా వచ్చే అవకాశం
న్యూఢిల్లీ/పాట్నా: దేశంలో సెకండ్ వేవ్లో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తొలి వేవ్ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందడంతోపాటు ప్రాణాలు తీస్తోంది. అయితే, కరోనా నుంచి కోలుకుంటున్నవారికి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ముప్పు దాపురించింది. కరోనా నుంచి తప్పించుకున్నామని సంతోషించేలోపే ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రమైన లక్షణాలతో జనాలను బలితీసుకుంటోంది.
Recommended Video

బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ ప్రమాదకరం..
మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదువుతున్నాయి. అయితే, తాజాగా, మరో ముప్పు వెలుగుచూసింది. బీహార్ రాష్ట్రంలో కొత్తగా వైట్ ఫంగస్ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాక, బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు చెబుతుండటంతో మరింత ఆందోళన నెలకొంది.

పాట్నాలో తొలిసారి వెలుగులోకి వైట్ ఫంగస్..
పాట్నాలో కరోనా లక్షణాలతో వచ్చిన రోగులకు టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే, అనుమానంతో మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైట్ ఫంగస్ వచ్చినట్లు తేలింది. ఈ మేరకు పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ సింగ్ వెల్లడించారు. ఇప్పటి వరకు నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని, ఇలాంటి కేసులు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉందని డాక్టర్ సింగ్ తెలిపారు.

ఇలాంటివారికే వైట్ ఫంగస్ వచ్చే అవకాశం.. ఎలా వస్తుందంటే?
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే షుగర్ పేషెంట్లు, ఎయిడ్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతోపాటు ఇతర ప్రధాన అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని డాక్టర్ సింగ్ తెలిపారు. సాధారణ కరోనా లక్షణాలే ఉంటాయని, ఎక్స్రే, సిటీ స్కాన్ ద్వారా వైట్ ఫంగస్ గుర్తించే అవకాశం ఉందన్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్ అందించే సమయంలో నిర్లక్ష్యం కారణంగా వైట్ ఫంగస్ సోకే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఆక్సిజన్ తయారీలో కుళాయి నీరు వాడుతున్నారని, అందులో వైట్ ఫంగస్ ఉంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు కారణయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications