ఆర్మీలో 'ఆర్డర్లీ' వ్యవస్థ: ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు, ఓ జవాన్ ఆరోపణ
నిన్నటిదాకా భద్రతా బలగాలకే పరిమితం అయిన 'జవాన్ వీడియోలు' వ్యవహారం మొట్టమొదటిసారి భారత సైన్యంలో కూడా చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: నిన్నటిదాకా భద్రతా బలగాలకే పరిమితం అయిన 'జవాన్ వీడియోలు' వ్యవహారం మొట్టమొదటిసారి భారత సైన్యంలో కూడా చోటుచేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ కూడా శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు.
ఇండియన్ ఆర్మీలో కొందరు అధికారులు జవాన్లతో చేయించకూడని పనులు చేయిస్తున్నారని, దీనిపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినందుకు ప్రతీకారంగా తనను టార్చర్ చేస్తున్నారని ఆ వీడియోలో అతడు ఆరోపించాడు.
భద్రతా బలగాల్లో ;విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు సరైన భోజనం, జీతభత్యాలు అందడంలేదన్న బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్ల వీడియోల దుమారం చల్లారక ముందే తాజాగా మూడో వీడియో బయటికి రావడం గమనార్హం.
డెహ్రాడూన్ లోని 42వ ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ లో లాన్స్ నాయక్ గా పనిచేస్తోన్న యజ్ఞ ప్రతాప్ సింగ్ శుక్రవారం యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. కొందరు ఆర్మీ అధికారులు కిందిస్థాయి జవాన్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించాడు.
బూట్లకు పాలిష్ చేయడం వంటి పనులు కూడా చేయించుకుంటున్నారని, ఇదే విషయమై గతంలో తాను రాష్ట్రపతి, ప్రధాని, రక్షణశాఖ, హోంశాఖలకు లేఖలు రాశానని, దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం వివరణ కూడా అడిగిందని అతడు ఆ వీడియోలో గుర్తు చేశాడు.
ఎప్పుడైతే ప్రధాని కార్యాలయం నివేదిక అడిగిందో, అప్పటి నుంచి తనకు వేధింపులు రెట్టింపు అయ్యాయని, అధికారులు దుర్భాషలాడుతూ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని, అయితే అది ఆర్మీ నియమాలకు విరుద్ధం కాబట్టి తాను ఆ పనికి పాల్పడలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని యజ్ఞ ప్రతాప్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇకనుంచి ఫిర్యాదుల పెట్టె: ఆర్మీ చీఫ్
భద్రతా బలగాలు, ఆర్మీ జవాన్ల వరుస వీడియోల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇకపై అన్ని చోట్లా 'ఫిర్యాదుల పెట్టెలు' ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తమ సమస్యలపై జవాన్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం కంటే, పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే బాగుటుందని ఆయన హితఫు పలికారు. ఇప్పటి వరకు వెలుగు చూసిన వీడియో ఉదంతాలపై విచారణ జరుగుతోందని, అలాగే ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో పాకిస్తాన్పై ఏ క్షణంలోనైనా సర్జికల్ దాడులకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ రావత్ పేర్కొన్నారు.