నిన్న తేజ్ బహదూర్... నేడు జీత్ సింగ్: సీఆర్పీఎఫ్ లోనూ అంతేనా?
సౌకర్యాల కల్పనలో తమ పట్ల కూడా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ తాజాగా జీత్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
శ్రీనగర్: సరిహద్దు భద్రతా దళానికి చెందిన తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను తమకు పెడుతున్న ఆహారం గురించి వీడియో ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేసి రక్షణ శాఖలో కలకలం రేపగా, ఒకరోజు కూడా గడవక ముందే ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా గళం విప్పాడు.
జీత్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సైన్యంతో సమానంగా తామూ విధులు నిర్వర్తిస్తున్నా.. సౌకర్యాల కల్పనలో తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆ వీడియోలో అతడు పేర్కొన్నారు.
"సైన్యంలో పనిచేసే సిబ్బందికే సౌకర్యాలు కల్పిస్తున్నారని మాకేమీ బాధ లేదు. కానీ మేం ప్రశ్నిస్తున్నది మా పట్ల చూపుతున్న వివక్ష గురించే. మాకు క్యాంటీన్ సౌకర్యం లేదు. కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవు. మా పెన్షన్ ఆగిపోయింది. అవసరమైనప్పుడు సెలవు తీసుకోవడానికి కూడా లేదు.." అని ఆ వీడియోలో జీత్ సింగ్ తన ఆవేదన వెళ్ళగక్కాడు.
ఇంకా... "లోక్ సభ ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు అన్నిటికీ మేమే భద్రత ఇస్తాం. విమానాశ్రయం, ప్రార్థనా స్థలాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు మా భద్రత కావాలి. కానీ మా సెలవులేమో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అడవుల్లో.. కశ్మీర్ లోయల్లో గడిచిపోతుంటాయి.." అని వాపోయాడు.
అంతేకాకుండా... ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు జీతాలు చెల్లిస్తారని, వారు సెలవులను తమ కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతారని, తమ గోడు పట్టించుకునేవారు ఎవరని ప్రశ్నించాడు.
సీఆర్పీఎఫ్ జవాన్లకు ఎలాంటి సంక్షేమ పథకాలూ లేవని, పెన్షన్ కూడా ఆపేశారని, ఉద్యోగం నుంచి రిటైరయ్యాక తామెలా బతకాలంటూ జీత్ సింగ్ ఆ వీడియోలో ఆవేదన చెందాడు.
అయితే ఉన్నతాధికారులేమో ఇప్పటికే జవాన్లపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. తేజ్ బహదూర్ ఫిర్యాదులపై బీఎస్ఎఫ్ అధికారులు స్పందిస్తూ అతడి క్రమశిక్షణారాహిత్యాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు జీత్ సింగ్ వీడియో ద్వారా సంధించిన ప్రశ్నలకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో?