కొత్త కాన్సెప్ట్ : గోశాల నిర్మాణం కోసం ఇతర వస్తువులపై పన్నేతర రుసుం
గోసంరక్షణ కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పన్నేతర రుసుం విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గోవును సంరక్షణ కోసం గోశాలలు నిర్మిస్తోంది ఆదిత్యనాథ్ సర్కార్. అయితే వీటి ఖర్చులు ఎక్కువ అవుతుండటంతో పలు వస్తువులపై అదనంగా 0.5 శాతం పన్నేతర రుసుం విధించనుంది. ఇది అమల్లోకి వస్తే మద్యం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇతర వస్తువులపై అదనంగా పన్నేతర రుసుం
గోవులను సంరక్షించే బాధ్యత ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. అయితే గోశాల నిర్మాణం కోసం ఖర్చు ఎక్కువ అవుతోంది. ఇందుకోసం కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది యూపీ సర్కార్. గోశాల నిర్మాణం కోసం వాటి మెయింటెయినెన్స్ కోసం ఇతర వస్తువులపై పన్నేతర రుసుం విధించింది. అయితే ఏ వస్తువులపై అదనంగా రుసుం విధించాలనే దానిపై త్వరలో జరిగే మీటింగ్లో నిర్ణయిస్తారు. అంతేకాదు టోల్ గేట్ల వద్ద కూడా 0.5శాతం అదనంగా పన్ను చెల్లించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలపైన ఇతర కన్స్ట్రక్షన్ కంపెనీలపైనా 0.5శాతం అదనంగా రుసుం విధించాలనే నిర్ణయానికి యోగీ సర్కార్ వచ్చినట్లు సమాచారం.
గోవుల సంరక్షణ బాధ్యత మున్సిపల్ శాఖదే
ఇదిలా ఉంటే కొత్తగా తీసుకొచ్చిన విధానం అమలు చేసేందుకు మండిలలో అదనంగా 1 నుంచి 2శాతం పన్నేతర రుసుం విధించేందుకు చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే 'గోవంశ్ ఆశ్రయ్ అస్తల్' పేరుతో గ్రామీణ మరియు పట్టణాలకు సంబంధించిన మున్సిపల్ శాఖ గోవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సిందిగా యూపీ కేబినెట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. అధికారులు ఇచ్చిన ప్రణాళికకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓకే చెప్పినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.
గోశాల నిర్మాణానికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నిధులు
ప్రస్తుతం తాత్కాలికంగా గోశాలలను ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీల్లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ అధికారి తెలిపారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే నిధులతో వీటి నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రతి జిల్లాలోని గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో 1000 గోవులు ఉండేలా షెడ్డు నిర్మాణం చేపడతామని చెప్పిన అధికారి ... వీటి నిర్మాణం కోసం రెండు గోసంరక్షణ పన్నేతర రుసుం పలు వస్తువులపై విధిస్తామని అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతవారం సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోవుల పరిస్థితిపై పర్యవేక్షించారని చెప్పారు. ఈ సందర్భంగా గోవులు మేత మేసేందుకు అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి వేసి... అవి మేత మేసేందుకు మార్గంను సరళతరం చేయాలని ఆదేశాలిచ్చారు.