కశ్మీర్పై చర్చలు విఫలం- ఎన్నికపై పీటముడి- సుప్రీం తీర్పుపైనే ఇరుపక్షాల ఆశలు
జమ్ముకశ్మీర్లో రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు తర్వాత అక్కడ పరిస్ధితుల్ని చక్కదిద్దేందుకు రాజకీయ నేతల్ని ఖైదీలుగా మార్చిన కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు తీర్పులతో వారు తిరిగి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి వారిలో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా ప్రధానితో భేటీకి ఆహ్వానం అందగానే తమలో తాము చర్చించుకున్న గుప్కర్ అలయన్స్ నేతలు... ఈ భేటీకి వెళ్లకపోతే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయని భావించారు. కానీ ఈ భేటీ తర్వాత కూడా వారంతా మౌనంగా ఉండిపోవడం చర్చలపై అనుమానాలకు తావిస్తోంది.
Recommended Video
ప్రధానితో కశ్మీర్ నేతల చర్చలు విఫలం ?
రెండు రోజుల క్రితం ప్రధాని మోడీతో కశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతల బృందం భేటీ అయింది. ఇందులో ప్రధానంగా కశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కేంద్రం కోరగా.. ముందు రాష్ట్ర హోదా ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించని ప్రధాని.. ముందుగా ఎన్నికలకు సహకరిస్తేనే రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ఆలోచిస్తామని తేల్చిచెప్పేశారు. దీంతో ఈ భేటీ ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. బయటికి వచ్చిన నేతలు ఏం చెప్పాలో తెలియక చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని చెప్పి వెళ్లిపోయారు.
ఎన్నికలు కోరుకుంటున్న కేంద్రం, కశ్మీర్ పార్టీలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న భారత్లో నేతల నిర్ణయాలే కీలకంగా మారిపోతున్నాయి. వారికి ప్రజలతో పనిలేకుండా పోతోంది. దీంతో ప్రజల మద్దతు ఉందని చెప్పుకునేందుకు వారికి లభిస్తున్న ఆయుధం ఎన్నికలే. దీంతో జమ్ముకశ్మీర్లో తమకు ప్రజల మద్దతు ఉందని చెప్పుకోవాలంటే అటు కేంద్రానికీ, ఇటు గుప్కర్ అలయన్స్కూ ఎన్నికలు తప్పనిసరి. ఎన్నికలు జరగడంలో ఆలస్యమైతే ప్రజల్లోనూ అసహనం పెరుగుతుంటుంది. దీంతో కేంద్రం ఎన్నికలకు ప్రయత్నిస్తుండగా.. దాన్ని రాష్ట్ర హోదాకు ముడిపెట్టి గుప్కర్ అలయన్స్ కేంద్రాన్ని ఇరుకునపెడుతోంది.
ఎన్నికలా .. రాష్ట్ర హోదానా ? ఏది ముందు
జమ్ముకశ్మీర్లో ముందుగా ఎన్నికలు నిర్వహించాలా లేక రాష్ట్ర హోదా పునరుద్ధరించాలా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఎందుకంటే కశ్మీర్ పార్టీల వాదన ప్రకారం అక్కడ ముందుగా రాష్ట్ర హోదా పునరుద్దరిస్తే ప్రజల్లో ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెరిగి ఎన్నికలకు తగిన వాతావరణం ఏర్పడుతుంది. కానీ కేంద్రం మాత్రం ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తే అప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాబోదని చెబుతోంది. దీంతో అక్కడే పీటముడి పడిపోతోంది.
ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పే శరణ్యం
జమ్ముకశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని అటు కేంద్రం, ఇటు రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. అయితే దాని కోసం ముందుగా ఎన్నికలు నిర్వహించాలా లేక రాష్ట్ర హోదా పునరుద్ధరించాలా అనే దానిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇప్పుడు అందరి చూపూ సుప్రీంకోర్టుపైనే ఉంది. ఎందుకంటే గతంలో రద్దు చేసిన ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో ఒకవేళ సుప్రీంకోర్టు గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తే సహజంగానే అక్కడ రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరుగుతుంది. అప్పుడు కేంద్రం నిర్ణయంతో పనిలేదు. అలా కాదని ఆర్టికల్ 370 రద్దును సమర్ధిస్తే మాత్రం రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం కావాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. దీంతో ఇరుపక్షాలు కూడా ఇప్పుడు సుప్రీంతీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి.