కుమారస్వామి వార్నింగ్ తో బీజేపీ ఆందోళన: ఎమ్మెల్యేలు, రిసార్టు రాజకీయాలు, హైదరాబాద్ లో!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఉన్న హెచ్.డి. కుమారస్వామి ఇచ్చిన వార్నింగ్ తో బీజేపీ నాయకులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రిసార్టు రాజకీయాలు చెయ్యడానికి సిద్దం అయ్యాయి. హెచ్.డి. కుమారస్వామి హెచ్చరికలతో బీజేపీ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించాలని ప్లాన్ వేశారు. ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉన్నారని కుమారస్వామి అంటున్నారు.
ఆపరేషన్ కమల
బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల పేరుతో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తే తాను చూస్తూ కుర్చోనని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. బీజేపీ నాయకులు ఐదు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే తాను ఆ పార్టీకి చెందిన 10 ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంటానని హెచ్.డి. కుమారస్వామి ఘాటుగా హెచ్చరించారు.
గుర్రాల వ్యాపారం
బీజేపీ నాయకులు ప్రజస్వామ్యాన్ని తుంగలోతొక్కి ఎమ్మెల్యేలను బజారులో గుర్రాలను కొనుగోలు చేసినట్లు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. బీజేపీ ఆపరేషన్ కమల మొదలుపెడితే తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కచ్చితంగా రిసార్టు రాజకీయాలు చెయ్యాల్సి వస్తోందని హెచ్.డి. కుమారస్వామి చెప్పారు.
హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు !
జేడీఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు శాసన సభాపక్ష సమావేశానికి హాజరుకాలేదని హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి విమానంలో నేరుగా బెంగళూరుకు వస్తారని, వారు బీజేపీకి అమ్ముడుపోలేదని హెచ్.డి.కుమారస్వామి స్పష్టం చేశారు.
బీజేపీకి గుబులు
తాను ఎమ్మెల్యేలను లాక్కోవడానికి సిద్దం అంటూ బీజేపీ నాయకులకు హెచ్.డి. కుమారస్వామి సవాలు చెయ్యడంతో బీజేపీ నాయకులు అలర్ట్ అయ్యారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు అందర్నీ రిసార్టుకు తరలించాలని బీఎస్. యడ్యూరప్ప తదితరులు ప్లాన్ వేస్తున్నారు.
ఎమ్మెల్యేలు ఎంజాయ్
బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించాలని నిర్ణయించారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఎమ్మెల్యేలు రిసార్టుల్లో ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అయ్యారు. మొత్తం మీద కర్ణాటకలో మళ్లీ రిసార్టు రాజకీయాలు మొదలు కావడంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.