డేరాబాబా వారసుడు జస్మిత్, అదృశ్యమైన విపాసన
సిర్సా: డేరా చీఫ్ రామ్ రహీమ్ సింగ్ కుమారుడు జస్మీత్ పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. డేరా సచ్ఛా సౌధా మేనేజ్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ విపాసన అదృశ్యమయ్యారు. దీంతో డేరాబాబా కొడుకు బాధ్యతలు అప్పగించేందుకు గుర్మీత్ ఒప్పుకొన్నారని సమాచారం.
డేరా మేనేజ్మెంట్ కమిటీ ఛైర్ పర్సన్ విపాసన శుక్రవారం నుండి డేరా సఛ్చా సౌధ ఆశ్రమం నుండి అదృశ్యమయ్యారు. ఆమె ఫోన్ కూడ పనిచేయడం లేదు. రామ్ రహీమ్ సింగ్, హనీప్రీత్ తర్వాత విపాసన అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా గుర్తింపు పొందారు.
2002లో ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో రామ్ రహీమ్ సింగ్కు 20 ఏళ్ళ పాటు జైలు శిక్ష పడింది. ఈ శిక్షతో డేరా సచ్చా షౌధ నాయకత్వ బాధ్యతల విషయంలో తీవ్ర చర్చ సాగుతోంది. విపాసన అదృశ్యం కావడంతో జస్మిత్కు పగ్గాలు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు రామ్ రహీమ్ సింగ్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
రెండు రోజుల క్రితం జైలులో రామ్రహీమ్సింగ్ను ఆయన తల్లి కలిశారు. డేరా సచ్ఛా సౌధ బాధ్యతలను జస్మిత్కు అప్పగించాలని ఆమె డేరా సఛ్చా సౌధ మేనేజ్మెంట్ కమిటీని కోరారు. ఈ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రామ్ రహీమ్ తల్లి ఈ డిమాండ్ను లేవనెత్తిన రెండు రోజులకే విపాసన అదృశ్యం కావడం గమనార్హం.