ప్లాస్మా థెరపీ పనికిరాదన్న ఐసీఎంఆర్- ప్రైవేటు ఆస్పత్రులకు షాక్- దందాలకూ బ్రేక్...
దేశంలో కరోనా చికిత్సకు వాడుతున్న ప్లాస్మా థెరపీపై నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా ఇది వైరస్ను తగ్గించలేదని ఐసీఎంఆర్ తేల్చేసింది. ఐదునెలలుగా నిర్వహించిన ట్రయల్స్ తర్వాత ఐసీఎంఆర్ ఈ అంచనాకు వచ్చేసింది. ప్లాస్మా థెరపీ వల్ల కరోనా మరణాలను నియంత్రించడం మాట అటుంచి కనీసం వైరస్ రోగి శరీరంలో వ్యాపించకుండా ఆడ్డుకోవడం కూడా సాధ్యం కాదని తన తాజా అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకూ ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు దూకుడుగా ముందుకు వెళుతున్న రాష్ట్రాలన్నీ గందరగోళంలో పడ్డాయి.
ఐసీఎంఆర్ అధ్యయనం..
దేశవ్యాప్తంగా కరోనా చికిత్సకు కొంతకాలంగా వినియోగిస్తున్న కాన్వలెస్కెంట్ ప్లాస్మా థెరపీ (సీపీ) విధానంపై ఐదు నెలలుగా ట్రయల్స్ చేస్తున్న ఐసీఎంఆర్ తాజాగా ఇది వైరస్ను అడ్డుకోవడంలో ఉపయోగపడదని తేల్చేసింది. 464 మంది సాధారణ కరోనా లక్షణాలున్న రోగుల్లో 235 మందిని ఓ గ్రూపుగా, మరో 229 మందిని మరో గ్రూపుగా ఉంచి వీరిలో మొదటి గ్రూపుకు ప్లాస్మా థెరపీ ద్వారా, రెండో గ్రూపుకు మెరుగైన సాధారణ చికిత్స అందించారు. చివరికి ఈ రెండు గ్రూపులకూ మధ్య కోలుకోవడంలో పెద్దగా తేడా ఏమీ లేదని తేలింది.
అంతేకాదు ఓ గ్రూపులో 34 మంది మరో గ్రూపులో 31 మంది చనిపోయారు కూడా. దీంతో ప్లాస్మా థెరపీ మరణాలనే కాదు వైరస్ను కూడా నియంత్రించలేదని ఐసీఎంఆర్ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.
ప్లాస్మా థెరపీతో కరోనా తగ్గదు..
ఐసీఎంఆర్ అధ్యయానికి ముందు ప్లాస్మా థెరపీపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశ్వాసంగా ఉన్నాయి. కానీ ఐసీఎంఆర్ తాజా అధ్యయనంతో ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగుల ప్రాణాలు కాపాడవచ్చన్న భ్రమలు తొలగిపోయాయి. ప్లాస్మా థెరపీ వాడినా, సాధారణ చికిత్స చేసినా కరోనా నియంత్రణలో కానీ, మరణాల్లో కానీ మార్పు లేదని తేలిపోవడంతో ఇక దాని కోసం భారీగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదని కూడా ఐసీఎంఆర్ తేల్చేసినట్లయింది. ఐసీఎంఆర్ తాజా నివేదికతో ప్లాస్మా థెరపీపై ఆధారపడుతున్న రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులకు కూడా భారీ షాక్ తగిలినట్లయింది. దీంతో వారు కొత్త మార్గాలు వెతుక్కునే పనిలో పడ్డారు.
ప్లాస్మా బ్యాంకులు వృథా..
కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ పనికొస్తుందన్న గత అంచనాలతో వివిధ రాష్ట్రాలు భారీ ఎత్తున ప్లాస్మా కణాలను సేకరించడం మొదలుపెట్టాయి. వీటిని భద్రపరిచేందుకు భారీగా ప్లాస్మా బ్యాంకులు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులు ప్రారంభించాయి. హర్యానాలోనూ సాధారణ కరోనా లక్షణాలున్న రోగులకు కూడా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్లాస్మా థెరపీతో కరోనా తగ్గుతుందన్న అంచనాలతో ప్రైవేటు ఆస్పత్రులు ఈ విధానం వాడుతూ భారీ ఎత్తున ఫీజులు కూడా వసూలు చేసేస్తున్నాయి. ప్లాస్మా కొనుగోళ్ల కోసం బ్లాక్ మార్కెట్లో భారీ దందాలే సాగుతున్నాయి. ఐసీఎంఆర్ తాజా నివేదికతో వీరందరికీ నిరాశ తప్పడం లేదు.
ప్లాస్మాతో డబ్బు వృథాయే అంటున్న డాక్టర్లు...
ప్లాస్మా థెరపీ వాడకంపై వైద్య వర్గాల్లోనే ముందునుంచీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్లాస్మా వాడకం ద్వారా రోగి శరీరంలో యాంటీబాడీలు పెంచవచ్చనే వాదనను ఆది నుంచీ వ్యతిరేకిస్తున్న డాక్టర్లు ఇప్పుడు ఐసీఎంఆర్ అధ్యయనంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోగులు ఇప్పటికైనా ప్లాస్మా కోసం డబ్బులు వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు. డాక్టర్లు మెరుగైన చికిత్స అందించగలిగితే కరోనాను నియంత్రించవచ్చని, దీనికి బదులుగా ప్లాస్మా కొనుగోలు కోసం పరుగులు తీయొద్దని కోరుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు వీఐపీలు ప్లాస్మా దానాల పేరుతో హంగామా చేస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ తాజా నివేదిక వారికీ షాక్ ఇచ్చింది.