చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా ‘వార్’నింగ్
ఎవరూ చూడనప్పుడు చొరబడాలి.. కొంత భూభాగాన్ని ఆక్రమించి మిలటరీ పోస్ట్ సెటప్ చేయాలి.. ఆ తర్వాత కొత్త సరిహద్దులతో మ్యాప్ లు తయారుచేసి.. చరిత్రపొడవునా ఆ ప్రాంతం మనతోనే ఉందని నిరూపించాలి.. ఇదీ.. గత 60 ఏళ్లుగా పొరుగుదేశాలతో చైనా అనుసరిస్తోన్న విధానం. మొత్తం 14 దేశాలతో సరిహద్దులు పంచుకునే చైనా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏకంగా లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇదే స్ట్రాటజీతో ఆక్రమించుకుంది. అయితే, తొలిసారి డ్రాగన్ దేశానికి భారత్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతుండటంతో దాని ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఆ క్రమంలోనే పలు అనుచిత చర్యలకు పాల్పడుతున్నది..

బ్లాక్ టాప్ పేరు మార్పు..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండగా... తొలిసారి డ్రాగన్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. గతంలో తూర్పు లదాక్ లోని గాల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, ఫింగర్ పాయింట్ల వద్ద చేదు అనుభవాలను చవిచూసిన భారత్.. ఇప్పుడు పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంపై పూర్తిగా పట్టు సాధించింది. సరిహద్దుల ఆక్రమణకు చైనా సైన్యం చేస్తోన్న ప్రతి ప్రయత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. మన భూభాగంలోని కీలక స్థావరాలను తనవిగా చెప్పుకునే చైనా.. తాజాగా ‘బ్లాక్ టాప్' పేరును ‘షెన్ పావ్ షాన్' గా మార్చేసింది. చైనీస్ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఇటీవల జారీ చేసిన అధికారిక ప్రకటనలో మన భూభాగంలోని బ్లాక్ టాప్ ను ‘షెన్ పావ్ షాన్'గా పేర్కొనడం గమనార్హం.

ఏక్కడుందీ బ్లాక్ టాప్?
తూర్పు లదాక్ లోని పాంగాగ్ సరస్సు దక్షిణ ప్రాంతం రెండు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా ఉంటున్నది. పాంగాగ్ సరస్సు దక్షిణ తీరం నుంచి సకాలా వరకున్న ప్రాంతాన్ని చుషూల్ సెక్టార్, కైలాష్ రేంజ్ గా అభివర్ణిస్తారు. హెల్మెంట్, బ్లాక్ టాప్, గురుంగ్ హిల్, మగర్ హిల్, సోమవారం కాల్పులు జరిగిన రేజంగ్ లా, ముఖ్పరీ పర్వతం తదితర వ్యూహాత్మక పాయింట్లన్నీ ఈ ప్రాంతంలోనివే. 1962 యుద్ధంలో ఈ పాయింట్లపై పట్టు సాధించడం వల్లే చైనా యుద్ధం గెలవగలిగింది. కాగా, ఇప్పుడు వీటిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడం ద్వారా చైనా సైన్యం కుయుక్తులను భారత్ నిలువరించగలిగింది. దీంతో విలవిల్లాడుతోన్న చైనా ఎన్నడూ లేని రీతిలో రోజుకు కనీసం ఐదారు ప్రకటనలు చేస్తూ తన ఫ్రష్ట్రేషన్ బయటపెట్టుకుంటోంది. ఆ ప్రాంతాలు ఇండియావి కావు, తమవేనని చెప్పుకునే క్రమంలో చైనా తొలిసారి బ్లాక్ టాప్ పేరును మర్చేయడం గమనార్హం.

ఇలా పేర్లు మార్చే దేశాలను కబ్జా..
తాను కన్నేసిన ప్రాంతాలకు అసలు పేర్లకు బదులు కొత్త పేర్లు సృష్టించే చైనా.. తర్వాతి కాలంలో వాటిని మెల్లగా కబ్జా చేసిన ఉదంతాలు చరిత్రపొడవునా ఉన్నాయి. 1950ల్లో టిబెట్ ను ఆక్రమించుకోడానికి ముందు నుంచే ఆ ప్రాంతాన్ని ‘జిజాగ్' గా పరిగణిస్తూ వచ్చింది. అలాగే 1960ల్లో తూర్పు తుర్కిస్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి దానికి ‘జిన్ జియాంగ్'అనే పేరు పెట్టి మ్యాపులు మర్చేసింది. తాజాగా చైనీస్ ఆర్మీ అధికారిక ప్రకటనల్లో భారత భూభాగంలో బ్లాక్ టాప్ ను ‘షెన్ పావ్ షాన్'గా అభివర్ణించింది. చైనా ఫ్ట్రస్ట్రేషన్ త్వరలోనే యుద్ధోన్మాదంగా మారబోతోందని తన అధికార మీడియాలో ప్రకటనలు చేస్తోంది.

భారత్కు బుద్ధి చెప్పాల్సిందే..
ఆగస్టు 29-30 రాత్రి సమయంలో పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలో చోటుచేసుకున్న పరిణామాలు సాధారణమైనవేమీ కావని డిఫెన్స్ నిపుణులు అంటున్నారు. సైనికపరంగా అక్కడి కీలక ప్రాంతాలపై భారత్ పట్టు బిగించడంతో చైనా విలవిల లాడుతోందని, రాబోయే రోజుల్లో అది దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని, భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈలోపే చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార మీడియా ‘గ్లోబల్ టైమ్స్'లో యుద్ధరాతలు ప్రచురితమయ్యాయి. ‘‘భారత్ కు కచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. పొలిటికల్ జాతీయవాదాన్ని తలకెత్తుకున్న భారత సైన్యం.. అక్రమంగా చైనాలోకి చొరబడింది. వివిధ వ్యూహాత్మక పాయింట్లను కైవసం చేసుకునే ప్రయత్నం చేసింది. పొరుగు దేశంతో శాంతిగా మెలగాల్సిందిపోయి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోన్న భారత్ కు తగిన సమాధానం చెప్పాల్సిందే'' అంటూ ఎడిటోరియల్స్ లో వార్ వార్నింగ్ లు జారీ చేసింది. పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో చైనా బలగాల మోహరింపు పెరిగుతున్నట్లు శాలిలైట్ చిత్రాల్లో వెల్లడికావడం దాని యుద్ధసన్నద్ధతను తెలియజేస్తున్నది.












Click it and Unblock the Notifications