లోక్సభ.. అసెంబ్లీ తీర్పు దేనికదే: బీజేపీ..విచిత్ర స్థితి: ఛరిష్మాకు చెక్: 40 రోజుల్లో రెండో ఓటమి..!
న్యూఢిల్లీ: నెలన్నర రోజులు. భారతీయ జనతా పార్టీ రెండో ఓటమిని మూటగట్టుకుంది. గత ఏడాది డిసెంబర్లో జార్ఖండ్ ఓటర్లు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే.. ఈ సారి దేశ రాజధానివాసుల వంతు వచ్చింది. కమలాన్ని కకావికలం చేశారు ఢిల్లీ ఓటర్లు. రెండు దశాబ్దాల తరువాత అయినా అధికారాన్ని అందుకోవాలనే అకాంక్షను చిదిమేశారు. దీనికి కారణాలు అనేకం. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాల నుంచి ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోలేదనే విషయాన్ని ఢిల్లీ పోలింగ్ స్పష్టం చేసినట్టయింది.
లోక్సభ సీట్లను కొల్లగొట్టి.. అసెంబ్లీ బరిలో చతికిల
నిజానికి- బీజేపీ ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంతు చిక్కని, ఓటర్ల నాడిని పట్టుకోలేని స్థితిలో పడింది. లోక్సభ ఎన్నికల్లో గంపగుత్తగా కమలం గుర్తుకు ఓట్లు వేసిన ఓటర్లు.. అసెంబ్లీ స్థానాల వద్దకు వచ్చే సరికి తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. దేనికదే అనే సందేశాన్ని ఇస్తున్నారు. నిన్న జార్ఖండ్.. నేడు ఢిల్లీల్లో ఒకే తరహా పరిస్థితి ఏర్పడింది. లోక్సభ ఎన్నికల మాటెలా ఉన్నప్పటికీ.. అసెంబ్లీ పోల్స్ సమీపించే సరికి స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు ఓటర్లు.
జాతీయ భావాలు ఒకవైపు..
ఓటర్లు విజ్ఙత గల వారు అని అంటుంటారు రాజకీయ పండితులు. వారి విజ్ఙత ఏ స్థాయిలో ఉందో.. దాని రుచి ఎలాంటిదో బహుశా బీజపీ నేతలకు తెలిసినంతగా మరే పార్టీకి తెలియక పోవచ్చు. ఆ విజ్ఙత ఉండటం వల్లే జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో కమల నాథులకు పట్టం కడుతున్నారు.. ఏకపక్షంగా. ఈ విషయంలో మరో పార్టీకి ఓటు వేయాలనే ఆలోచన కూడా ఓటర్లు రావట్లేదనడానికి 2015, 2019 ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే నిదర్శనం.
స్థానిక అంశాలు మరోవైపు..
అసెంబ్లీ ఎన్నికలు సమీపించే సమయానికి ఓటర్లు భిన్నమైన తీర్పును ఇస్తున్నారు. బీజేపీ నేతలను పక్కన పెడుతున్నారు. స్థానిక అంశాలు, సమస్యల పరిష్కారాల వైపునకే మొగ్గు చూపుతున్నారు. రెండున్నర నెలల కిందటే ముగిసిన జార్ఖండ్.. తాజాగా వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఉన్న తేడా ఏమిటో కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తున్నాయి.
Recommended Video
జార్ఖండ్లో 12, ఢిల్లీలో ఏడింటికి ఏడూ..
జార్ఖండ్లో మొత్తం 14 లోక్సభ స్థానాలు ఉండగా.. గత ఏడాదే నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా విజయాన్ని సాధించింది. 14 లోక్సభ స్థానాలకు గాను 12 చోట్ల విజయాన్ని నమోదు చేసింది. మిగిలిన రెండు సీట్లను స్వల్ప మెజారిటీతో కోల్పోయింది. ఇక ఢిల్లీలోనూ అదే పరిస్థితి. ఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉండగా..ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఏడు చోట్లా కాషాయ జెండాను పాతారు బీజేపీ నేతలు. సరిగ్గా ఎనిమిది నెలలు తిరిగే సరికి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూశారు.