బద్రీనాథ్లో మోడీ! కేదార్నాథ్లో వివాదాల అగ్గి రాజేసి..!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయ సందర్శన, అక్కడి కొండ గుహల్లో కాషాయరంగు శాలువా కప్పుకొని మౌనమునిలా కనిపించి, రాజకీయ ప్రత్యర్థుల నోటికి పని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా.. బద్రీనాథ్ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన బద్రీనాథ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ లో పలువురు బీజేపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి కారులో బద్రీనాథ్ ఆలయానికి చేరుకున్న మోడీని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు.. సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మోడీ.. రెండురోజుల ఆధ్యాత్మిక పర్యటనను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదార్ నాథ్ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో, హిమాలయ పర్వత పంక్తుల్లోని గుహల్లో 15 గంటల పాటు ఏకాంతంగా గడిపారు. అనంతరం- బద్రీనాథుణ్ణి సందర్శించారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా ఢిల్లీ వెళ్తారా? లేక చార్ ధామ్ యాత్ర చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఈ యాత్రపై బీజేపీయేతర పార్టీలు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందంటూ విమర్శిస్తున్నారు ఆయా పార్టీల నాయకులు.

ఏమీ కోరుకోలేదు..
బద్రీనాథ్ సందర్శన సందర్భంగా మోడీ.. కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. తాను ఆ భగవంతుడిని ఏమీ కోరుకోలేదని అన్నారు. ఇతరులకు ఇవ్వదగ్గ సామర్థ్యాన్ని ఆ దేవుడు తనకు కల్పించాడని పేర్కొన్నారు. ఒకటికి రెండుసార్లు తాను కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించానని, ఇది తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు.
Uttarakhand: Prime Minister Narendra Modi arrives at Badrinath Temple. pic.twitter.com/BRlyrVOLEZ
— ANI (@ANI) May 19, 2019












Click it and Unblock the Notifications