మోడీని కలిసిన అమీర్ఖాన్, నిప్పులు చెరిగిన శివసేన
ముంబై/న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బాలీవుడ్ చిత్ర కథానాయకుడు అమీర్ ఖాన్ సోమవారం కలిశారు. ఎనిమిదేళ్ల క్రితం.. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమీర్ ఆయనపై విమర్శలు చేశారు. ఇప్పుడు న్యూఢిల్లీలో ఆయన కార్యాలయంలో అమీర్ ఖాన్ కలిశారు.
సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంవో)లో మోడీని అమీర్ ఖాన్ కలిశారు. మోడీని కలిసిన అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ... ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంపై మోడీ మట్లాడారని, మరీ ముఖ్యంగా పేదవారి జీవితాల్లో సంతోషాన్ని చూడాలనుకుంటున్నారని కితాబిచ్చారు.
ఆయన లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం తప్పకుండా సహకరించాల్సి ఉందన్నారు. ప్రజలు, తాను మోడీ నుండి ఎంతో అభివృద్ధి ఆశిస్తున్నామని చెప్పారు. కాగా, 2006లో నర్మదా డ్యాం విషయమై అమీర్ ఖాన్ నాటి ముఖ్యమంత్రి, నేటి ప్రధానమంత్రి మోడీని తప్పు పట్టారు. కాగా, మోడీని అమీర్ ఖాన్ కలవడంపై పిఎంవో ట్వీట్ చేసింది.
ఛార్జీల పెంపుపై శివసేన ఆగ్రహం
రైలు చార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శివసేన తప్పుబట్టింది. ఈ నిర్ణయం వల్ల ముంబై ప్రజలపై భారం పడుతుందని నిరసన వ్యక్తం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ రైలు చార్జీలను పెంచి ఉంటే బీజేపీయే ముందుగా దాన్ని వ్యతిరేకించి ఉండేదని అభిప్రాయపడింది.
ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం వెలువడింది. ఇకపై రైలు చార్జీలను పెంచవద్దని, సామాన్యులపై భారం మోపవద్దని అందులో కోరింది. ప్రయాణీకుల చార్జీలను 14.2 శాతం, రవాణా చార్జీలను 6.5శాతం పెంచుతూ రైల్వేశాఖ రెండు రోజుల క్రితం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పెంపు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానుంది.