లోక్ సభకు ముందస్తు ఖాయం ? చంద్రబాబు, మమత, నితీశ్ దీ అదే మాట...
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వచ్చేస్తోంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను కేంద్రం ముందుగానే నిర్వహించబోతోందనే అంచనాలు విపక్షాల్లో పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంకేతాలుకూడా వచ్చాయని విపక్ష పార్టీలు చెప్తున్నాయి. లోక్ సభకు ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరిలోనే ముందస్తు ఎన్నికలు ఉండొచ్చని నిన్న బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అంచనా వేశారు. ఇవాళ చంద్రబాబు, నితీశ్ కుమార్ కూడా ఇదే మాట చెప్పారు.
దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ జోస్యం చెప్పారు. ఢిల్లీలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న చంద్రబాబు.. స్ధానికంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో ముందస్తు ఎన్నికలు తప్పవనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ముందస్తు ఎన్నికలు జరగొచ్చంటూ ఎప్పటి నుంచో చెబుతున్న విషయాన్ని ఇప్పుడు మరోసారి చెప్పినట్లయింది.

అటు బీహార్ సీఎం, విపక్ష ఇండియా కూటమిలో కీలకమైన నితీష్ కుమార్ కూడా ముందస్తు ఎన్నికలు తప్పవనే అర్ధం వచ్చేలా ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరగాల్సిన లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని నితీష్ అంచనా వేస్తున్నారు. విపక్షాల ఐక్యత నేపథ్యంలో తమకు మరింత నష్టం తప్పదని అంచనా వేసుకుంటున్న ఎన్డీయే ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతోందని నితీశ్ కుమార్ వెల్లడించారు.
లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయంటూ నిన్న మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నితీశ్ కుమార్.. తాను ఈ విషయం ఏడెనిమిది నెలలుగా చెబుతూనే ఉన్నట్లు గుర్తుచేశారు. కాబట్టి ఎన్డీయేను ఓడించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే విషయంలో తనకు ఎలాంటి పదవీ కాంక్ష కూడా లేదన్నారు. ఎన్నికల్లోపు సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీల్ని బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయడమే తన అజెండా అన్నారు.












Click it and Unblock the Notifications