ఇక్కడ మీరే మెజార్టీ, సామర్థ్యం గుర్తించి ఓటేయండి : కతియార్లో ముస్లింలను ఉద్దేశించి సిద్దూ
పాట్నా : సార్వత్రిక ఎన్నికల వేళ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నోటి దురుసు కారణంగా ఇటీవలే యోగి ఆదిత్యనాథ్, మాయావతి, ఆజాంఖాన్, మేనకా గాంధీని ప్రచారం నుంచి కొన్ని గంటలపాటు ఎన్నికల సంఘం తప్పించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా చేరనున్నారు.
మీరే మెజార్టీ ..
బీహార్లోని కతియార్లో జరిగిన ర్యాలీలో సిద్దూ ప్రసంగించారు. ఇక్కడినుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత తారిఖ్ అన్వర్ బరిలోకి దిగారు. ఇక్కడ మెజార్టీ ఓటర్లు ముస్లింలే. అందుకే వారినుద్దేశించి, ఇక్కడున్న ముస్లింలంతా ఒక్కటై ప్రధాని మోదీని ఓడించాలని కోరారు. ఇటీవలే మాయావతి, మేనకా గాంధీ .. ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరవకముందే సిద్దూ కామెంట్లు కలకలం రేపుతోన్నాయి.
సామర్థ్యం గుర్తించండి
'మిమ్మల్ని మీరు మైనారిటీలుగా భావించకండి, ఇక్కడ మీరు మెజార్టీ స్థానంలో ఉన్నారు. కతియార్లో 64 శాతం జనాభా ముస్లింలదే .. అలాగే మీరు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్రాప్ లో పడొద్దన్నారు. మీ సామర్థ్యాన్ని గుర్తించి ఓటేయండి, సాముహికంగా ఒక్కటే ప్రధాని మోదీని ఓడించాలి‘ అని కతియార్ లోక్ సభ నియోజకవర్గంలోని బాల్ రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గల బారసోల్ రోడ్ షోలో వ్యాఖ్యానించారు.
వైరల్ .. ఈసీ వివరణ
సిద్దూ చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రసారమయ్యాయి. సిద్దూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని .. సిద్దూపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు కోరారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఎన్నికల సంఘం ఆదేశించిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.