పహల్గాం ఎఫెక్ట్: ఆర్మీ యూనిఫామ్ లో బయట కనిపిస్తే 3 నెలలు జైలు, జరిమానా?
అందరూ సైనికులు,జవాన్లు, ఆర్మీ అధికారులు కాలేరు. దేశానికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో పాటు వయసు, ఎత్తు, ఆరోగ్యం, చదువు, డిగ్రీ ఇలా చాలానే ఉంటాయి. అన్నిట్లోనూ రాణిస్తేనే ఆర్మీ అధికారులు అవుతారు. జవాన్లు, సైనికులుగా గుర్తింపు పొందుతారు. అయితే దేశంలో చాలా మంది యువతతోపాటు పెద్దవాళ్లు కూడా ఆర్మీ డ్రెస్ ఆన్ లైన్ లో కొనుక్కుని ధరిస్తుంటారు. ఇంకెంత మంది అచ్చం ఆర్మీ యూనిఫామ్ లానే ఉండే డ్రెస్ లు వేసుకుని రోడ్ల పై దర్శనమిస్తుంటారు. వాళ్లను చూస్తే.. వీళ్లు జవాన్లు ఏమో అన్న సందేహం వస్తుంది. కానీ వాళ్లు సామాన్య ప్రజలే. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మితిమీరి పోయాయి. రీల్స్ ,యూట్యూబ్ షార్ట్స్ కోసం ఆర్మీ డ్రెస్ ను కించపరుస్తూ ఎవరు పడితే వాళ్లు ధరిస్తున్నారు. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
జమ్ము కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందిన వార్త తెలిసిందే. ఉగ్రవాదులు భారత ఆర్మీ, పోలీస్ డ్రెస్ లు ధరించడం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు. దీంతో వాళ్లు సాధారణ ప్రజల్లోకి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్న కొన్ని నిబంధనల్ని కఠినతరం చేసింది.
ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ కోసం అవసరమైన బట్టలు కేవలం ఆర్మీ అధికారిక స్టోర్లలో లభ్యమయ్యేలా ఉన్న రూల్స్ ను ఇప్పుడు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. సాధారణ పౌరులు ఆర్మీ యూనిఫామ్ ధరించి బయట తిరిగితే 3 నెలలు జైలు, రూ. 500 జరిమానా విధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గతంలో ఆర్మీ యూనిఫామ్ వివిధ బట్టల షాపుల్లో దొరికేవి. అక్కడే యూనిఫామ్ కుట్టించుకునే అవకాశమూ ఉండేది. కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. నిజమైన ఆర్మీ యూనిఫామ్స్ కేవలం ఆర్మీ కాంటీన్ల ద్వారానే అందుతుంది. యూనిఫామ్ పొందాలంటే ఆర్మీ ఐడీ కార్డ్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సాధారణ ప్రజలు ఆర్మీ యూనిఫామ్ ధరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications