కులం ఆధారంగా ఉపాధి హామీ చెల్లింపులు-రాష్ట్రాల అభ్యంతరాలు-వెనక్కి తగ్గిన కేంద్రం
దేశవ్యాప్తంగా యూపీఏ సర్కార్ హయాం నుంచి అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంనరేగా) చెల్లింపుల్ని కులం ఆధారంగా విడివిడిగా చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకూ అన్ని చెల్లింపుల్ని కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఒకే ఖాతా నుంచి చేస్తుండగా.. ఇప్పుడు మాత్రం కులం ఆధారిత చెల్లిుంపులు చేయాలని కేంద్రం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రాలకు మంట పుట్టించింది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కూడా తన క్షేత్ర నివేదికలో గ్రామ వర్గాలలో కుల విభజన తీవ్రతరం కావడాన్ని సూచించింది, ఎందుకంటే కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కార్మికుల్ని మూడు గ్రూపులుగా విభజించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలు (SC లు), షెడ్యూల్డ్ తెగలు (ST లు) మరియు ఇతరులు ఉన్నారు. మార్చి 2 న, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వేతనాల చెల్లింపుల కోసం 2021-22 నుండి MGNREGA కింద ఎస్సీలు, ఎస్టీలు మరియు ఇతరులకు చెల్లింపులను ప్రత్యేక కేటగిరీలుగా విభజించాలని ఆదేశించింది. దీని ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కులం ఆధారంగా జాతీయ ఉపాధి హామీ పథకం చెల్లింపులు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని తమిళనాడు, కర్నాటక సహా పలు రాష్ట్రాలు తప్పుబట్టాయి. లౌకిక రాజ్యంలో ఉపాధి హామీ పథకం చెల్లింపులు కులాల ఆధారంగా చేయడమేంటని కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో కేంద్రం ఇరుకునపడింది. చివరకు చేసేది లేక వివాదాస్పద ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంటూ కేంద్రం మరో ఉత్తర్వు జారీ చేసింది. కేంద్రం ఆధేశాలు వివాదాస్పదంగా మారిన తరుణంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమై దీనిపై చర్చించారు. చివరికి తమ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం తాజా ఉత్తర్వుల ఉపసంహరణతో ఇకపై ఉపాధి హామీ చెల్లింపుల్ని తిరిగి గతంలోలా ఒకే ఖాతా ద్వారా చేయబోతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు, ఒకే మస్టర్ రోల్లో పనిచేసిన అన్ని వర్గాల (SC, ST మరియు ఇతరులు) సింగిల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ద్వారా చెల్లించేవారు. తిరిగి ఇప్పుడు ఆ విధానమే అమల్లోకి రానుంది. గ్రామీణ, సామాజిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల (తమిళనాడు, కర్ణాటక) నుండి అభ్యంతరాలు స్వీకరించిందని, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఫీల్డ్ నుండి ముందస్తు చెల్లింపు విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వారికి సమాచారం ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.