అనుకోని అతిథులు: కేరళ వరదల తర్వాత ఇళ్లల్లో మకాం వేసిన మొసళ్లు పాములు
కేరళ: కేరళలో కురిసిన భారీ వర్షాలకు ఆ రాష్ట్రం వరదల్లో మునిగింది. ఇప్పటికే దేవభూమి సర్వం కోల్పోయింది. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో అప్పటి వరకు ఇంటి పైకప్పునే తలదాచుకున్న స్థానికులు... ఆ తర్వాత సహాయక శిబిరాలకు చేరుకున్నారు. ఇంట్లో వస్తువులన్నీ అలానే వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కేరళ వాసులు కాలం వెల్లదీశారు. గత వందేళ్లలో ఎన్నడూ లేని ప్రకృతి విపత్తును కేరళ కళ్లారా చూసింది. కొన్ని వందల ప్రాణాలు ఈ ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి. ఇక పశువులు కూడా ఈ వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఇక అడవిలో ఉండే కృూర జంతవుల పరిస్థితి కూడా ఇదే. ఏ జంతువు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని చుట్టుపక్కల అటవీప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కేరళలో క్రమంగా వరదనీరు తగ్గుతూ వస్తుండటంతో అక్కడి ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అప్పటి వరకు రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న వీరంతా ఇళ్లలో వస్తువులు భద్రంగా ఉన్నాయో లేదో అని కంగారుతో ఇళ్లలోకి అడుగుపెడుతున్నారు. ఇళ్లలోకి అడుగుపెట్టిన వీరకి సామాన్ల సంగతి అటుంచితే... వారికి అనుకోని అతిథులు దర్శనమిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాలకు పాములు, మొసళ్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. ఎవరూ లేని ఇళ్లలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. త్రిసూరు జిల్లాలోని చాలకుడి అనే ఊర్లో.. సహాయక శిబిరం నుంచి తన ఇంటికి చేరుకున్న వ్యక్తికి మొసలి కనపడటంతో షాక్కు గురయ్యాడు. ఇన్ని రోజులు వరదలతో తల్లడిల్లిన ప్రజలు ఇప్పుడు ఈ ప్రమాదకర జంతువులు ఎక్కడ దాగిఉన్నాయో అని భయపడుతున్నారు. మొసలిని చూసిన వ్యక్తి తన బంధువుల సహాయంతో మొసలిని బంధించి తాళ్లతో కట్టిపడేశాడు.

Recommended Video

ఇక ముస్తాఫా అనే పాములు పట్టే వ్యక్తి వరద నీరు క్రమంగా తగ్గుతుండటంతో ఇప్పటికే కొన్ని వందల పాములను పట్టి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. వరదలు వచ్చినసమయంలో పాములు ఇతరత్రా విషపురుగులు కొట్టుకురావడం సహజమేనన్నాడు ముస్తాఫా. సహాయక శిబిరాల నుంచి తిరిగి ఇంటికి చేరుకుంటున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. బూట్లలో కానీ, టైల్స్ కింద కానీ చేతులు పెట్టకూడదని సూచించారు. ఎర్నాకుళం జిల్లాలోని అంగమలైలోని ఓ హాస్పిటల్లో పాముకాటుకు గురై 52 మంది చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఇళ్లలో పాములను చూసి భయంతో ఇంటికి వెళ్లడం మానేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాము కాటుకు విరుగుడు మందు సరఫరా చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications