పోలిస్ కానిస్టేబుల్ ను తరిమి కొట్టిన న్యాయవాదులు..!
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ను కొందరు న్యాయవాదులు చితగ్గొట్టిన తాజా ఉదంతం ఇది. దేశ రాజధానిలోని సాకేత్ జిల్లా న్యాయస్థానం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా న్యాయవాదులు ఆందోళన కొనసాగిస్తున్న సమయంలో విధి నిర్వహణలో భాగంగా బైక్ పై అటుగా వచ్చిన ఓ కానిస్టేబుల్ పై వారు చేయి చేసుకున్నారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేంత వరకూ వదల్లేదు. తరిమి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెండు రోజుల కిందట న్యూఢిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానం ఆవరణలో ఢిల్లీ పోలీసులు, న్యాయవాదుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో పోలీసులు, న్యాయవాదులు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. వారి వాహనాలను తగుల బెట్టుకున్నారు.
Lawyers at Saket district court in Delhi thrashed an on-duty policeman.
— Rishi Bagree ऋषि 🇮🇳 (@rishibagree) November 4, 2019
Indian Lawyers who are suppose to fight for truth, are turning into goons and thugs pic.twitter.com/I4H3bltzEq
సుమారు మూడు గంటల పాటు న్యాయస్థానం సమీపంలో యథేచ్ఛగా దాడులు చేసుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపినప్పటికీ.. న్యాయవాదులు వెనక్కి తగ్గలేదు. ఫలితంగా వారిపైనే కాల్పులు జరిపాల్సి వచ్చింది. దీనికి ఆగ్రహించిన న్యాయవాదులు పోలీసుల వాహనాలకు నిప్పంటించారు.
దీనికి నిరసగా న్యాయవాదులు సోమవారం నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చారు. ఢిల్లీ హైకోర్టు సహా అన్ని జిల్లా న్యాయస్థానాల్లో విధులను బహిష్కరించారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టారు. ర్యాలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి న్యాయవాదుల ర్యాలీకి బందోబస్తుగా విధి నిర్వహణ కోసం వచ్చారు ఓ కానిస్టేబుల్. కొందరు న్యాయవాదులు ఆయనపై దాడి చేశారు. ఆయనపై చేయి చేసుకున్నారు. హెల్మెట్ ను లాక్కున్నారు. వీపుపై పిడి గుద్దులు గుద్దారు. సంఘటనాస్థలం నుంచి వెల్లిపోయేంత వరకూ కొడుతూనే కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.