మానవత్వం ఎక్కడ?: లైవ్ స్ట్రీమింగ్లో ఆత్మహత్య: 2వేల మంది చూశారు కానీ, ఒక్కరూ ఆపలేదు
ఆగ్రా: రానురాను మనుషుల్లో కనీస మానవత్వం లేకుండా పోతోంది. ఇందుకు ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత రెండ్రోజుల క్రితం రాజస్థాన్లో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చావు బతుకుల్లో ఉండి కాపాడమని వేడుకుంటుంటే.. వారి వద్దకు వెళ్లిన కొందరు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారే తప్ప.. వారిని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు.
దీంతో ఆ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా, సరైన సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఉంటే వారు బతికే వారని పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు. దాన్ని చాలా మంది చూశారు కానీ ఒక్కరు కూడా పోలీసులకు ఫోన్ చేయకపోవడం గమనార్హం.

సైన్యంలో చేరాలని..
మృతుడిని 24ఏళ్ల మున్నా కుమార్గా గుర్తించారు. భారత సైన్యంలో చేరేందుకు ఐదు సార్లు ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

లైవ్ స్ట్రీమింగ్లో పెట్టి ఆత్మహత్య
మున్నా న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగర్కు చెందిన వ్యక్తి. బీఎస్సీ పూర్తిచేసి సైన్యంలో చేరేందుకు ప్రయత్నాలు చేశాడని పోలీసులు తెలిపారు.బుధవారం ఉదయం అతడు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఒక్కరూ కూడా పోలీసులకు ఫోన్ చేయలేదు..
కాగా, మున్నా ఉరి వేసుకోవడానికి ముందు 1.09 నిమిషాల పాటు లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు. దానిని 2,750 మంది చూశారు. కానీ, ఒక్కరు కూడా పోలీసులకు గానీ, అతడి కుటుంబ సభ్యులకు గానీ సమాచారం చేరవేయకపోవడం విచారకరం. అయితే, కొందరు అతని స్నేహితులు మాత్రం ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. అయినా ఫలితం లేకపోయింది.

ఆరుపేజీల సూసైడ్ నోట్..
మున్నా ఉరి వేసుకున్న ప్రాంతంలో ఆరు పేజీల సుసైడ్ నోట్ లభించింది. అందులో ఆర్మీ ప్రవేశ పరీక్షలో ఎంపిక కానందుకు తనను తాను నిందించుకున్నాడు. తన తల్లిదండ్రులను నిరాశపరిచానని పేర్కొన్నాడు. ఆర్మీ పరీక్షలో విఫలం అయ్యానని బాధపడకుండా ఉండేందుకు మున్నా కోసం కిరాణా షాపు పెట్టానని అతడి తండ్రి తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications