రేపట్నుంచే పార్లమెంటు సమావేశాలు: ఐదుగురు ఎంపీలకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా, ఐదుగురు లోక్సభ సభ్యులకు కరోనా సోకింది. కాగా, సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు సభ్యులు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఉభయ సభల సభ్యుల కోసం పార్లమెంటు ప్రాంగణంలో మూడు కోవిడ్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
దాదాపు సభ్యులంతా ఇప్పటికే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొందరి ఫలితాలు రావాల్సి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి అఖిలపక్ష సమావేశాన్ని కూడా రద్దు చేశారు. నేరుగా బీఏసీ సమావేశం నిర్వహించి సభలో చర్చించాల్సిన అంశాల ఏజెండాను ఖరారు చేశారు.
అంతేగాక, క్వశ్చన్ అవర్ తీసేశారు. రాతపూర్వక సమాధానాలు మాత్రమే ఇస్తారు. జీరో అవర్ను తగ్గించేశారు. ప్రతిరోజు నాలుగు గంటలపాటు మాత్రమే సమావేశాలు జరుతాయి. ఉభయసభల్లోనూ నిబంధనలను పాటించనున్నారు. భౌతిక దూరం పాటించేలా సీట్ల కేటాయింపు జరిగింది. కరోనా నిబంధనల అమలు కోసం పలు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేపట్టారు.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
కరోనా కల్లోలం నేపథ్యంలో జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా, చైనాతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ఉద్యోగాలు లాంటి కీలకాంశాలపై ఉభయసభల్లో ప్రతిపక్షాలు గట్టిగానే ప్రస్తావించే అవకాశం ఉంది.