ప్రధాని మోడీపై అట్నుంచి నరుక్కొస్తోన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడుల తీవ్రతరమౌతూ వస్తోన్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈడీ దాడులు కొనసాగుతోన్నాయి. కాంగ్రెస్ సైతం దీనికి మినహాయింపేమీ కాదు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, అంతకుముందు ఆ పార్టీ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో..
రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈడీ అధికారుల నుంచి సమన్లను అందుకున్నారు. ఆయన విచారణకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు వారంతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించినప్పటికీ.. ఈ కేసులో పురోగతి సాధించేలా ఎలాంటి సాక్ష్యాధారాలను ఈడీ అధికారులు సేకరించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఆందోళనలు నిర్వహించినా..
అందుకే మల్లికార్జున ఖర్గేకు సమన్లను జారీ చేశారని చెబుతున్నారు. అదే సమయంలో దేశ రాజదానిలో గల నేషనల్ హెరాల్డ్ భవనాన్ని సీజ్ చేయడం.. ఈ కేసు తీవ్రతకు అద్దం పట్టింది. దీనిపై ఈడీ అధికారులు ఏ స్థాయిలో పట్టుదలను ప్రదర్శిస్తోన్నారనేది దీనితో స్పష్టమైంది. సోనియా గాంధీ-రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రదర్శనలను నిర్వహించింది కాంగ్రెస్. రాష్ట్రాలవారీగా ఆందోళనలు చేపట్టింది. అయినప్పటికీ.. పెద్దగా ఫలితం రాలేదు.

రూటు మార్చిన కాంగ్రెస్..
దీనితో కాంగ్రెస్ నేతలు తమ రూటు మార్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-ఈడీ అధికారులపై తమ దాడి తీవ్రతను పెంచేలా ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం, నిరుద్యోగం వంటి అంశాలను తెరమీదికి తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఇవ్వాళ దేశరాజధానిలో భారీగా ర్యాలీలు, ఆందోళలనను నిర్వహించడానికి సమాయాత్తమౌతోన్నారు.

ప్రధాని నివాసం వద్ద ఘెరామ్..
ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్ద ఇవ్వాళ ఘెరామ్ నిర్వహించనున్నారు. పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్ వరకు భారీ నిరసన ప్రదర్శననూ తలపెట్టారు. రాష్ట్రపతి భవన్ ర్యాలీనీ చేపట్టనున్నారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం, ఆహార వస్తువులపై జీఎస్టీ విధించడం వల్ల అదే స్థాయిలో వాటి రేట్లు పెరగడం, అడ్డూ అదుపు లేకుండా నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి వ్యతిరేకంగా ఆయా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు.

144 సెక్షన్..
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీ పరిధిలో 144 సెక్షన్ను విధించారు. జంతర్ మంతర్ ప్రాంతాన్ని దీని నుంచి మినహాయించారు. ఈ మేరకు కేసీ వేణుగోపాల్కు సమాచారం పంపించారు. 144 సెక్షన్ను విధించినందున ఎలాంటి నిరసన ప్రదర్శనలు గానీ, ర్యాలీలు గానీ, ఆందోళనలను గానీ నిర్వహించడానికి వీల్లేదని పేర్కొన్నారు. జంతర్ మంతర్ ప్రాంతాన్ని 144 సెక్షన్ నుంచి మినహాయించడం వల్ల అక్కడ వాటిని నిర్వహించుకోవచ్చని సూచించారు.












Click it and Unblock the Notifications